Revanth Reddy: మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ నాయకులపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ పాలనను “దోపిడీ దారుల పాలన”గా అభివర్ణిస్తూ, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు. పదేళ్ల కాలంలో తెలంగాణను అప్పుల పాలు చేసి, వేల కోట్ల రూపాయలను కేసీఆర్ కుటుంబం కొల్లగొట్టిందని ఆరోపించారు. గంజికి గతి లేనోళ్లు ఇవాళ ఎకరాల కొద్దీ ఫామ్ హౌస్లు, బెంజ్ కార్లు ఎలా సంపాదించారని ఆయన ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. భార్యాభర్తలు మాట్లాడుకునే వ్యక్తిగత సంభాషణలను సైతం విన్న సిగ్గులేని ప్రభుత్వం గతంలో ఉండేదని, జడ్జిలు, జర్నలిస్టులు, సినిమా తారలను కూడా వదలకుండా ఫోన్లు ట్యాప్ చేయించిన కేసీఆర్కు అసలు మనిషిగా జీవించే అర్హత ఉందా అని నిలదీశారు. ఇలాంటి క్రూరమైన నేరాలకు పాల్పడిన వారికి నోటీసులు ఇస్తే, ఆయనను “జాతిపిత” అని సంబోధించడం తెలంగాణ సమాజానికే అవమానమని మండిపడ్డారు. కేసీఆర్ కేవలం తన సొంత వారి కోసమే పనిచేశారని, శ్రీకాంతాచారి వంటి అమరవీరుల కుటుంబాలను గాలికి వదిలేశారని విమర్శించారు.
నల్గొండ జిల్లాకు శాపంగా మారిన ఎస్ఎల్బీసి (SLBC) ప్రాజెక్టును కేసీఆర్ కావాలనే పడావు పెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. జిల్లా ప్రజలపై కసితో, కడుపులో విషం పెట్టుకుని ప్రాజెక్టు పనులు ఆపేశారని, ఎనిమిది మంది చనిపోయినా కనీసం సానుభూతి చూపని దుర్మార్గపు ఆలోచన కేసీఆర్దని మండిపడ్డారు. “మందిని ముంచిన సొమ్ము వాళ్ల దగ్గర మస్తుగా ఉంది.. బీఆర్ఎస్ వాళ్లు ఏది ఇచ్చినా తీసుకోండి కానీ, ఓటు మాత్రం కాంగ్రెస్కే వేయండి” అని ప్రజలకు పిలుపునిచ్చారు. దోపిడీ దారులకు, దొంగలకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Read Also: Revanth Reddy: రైతులకు రేవంత్ రెడ్డి భరోసా.. ఎన్నికల తర్వాత రూ.9 వేల కోట్లు విడుదల..!