తెలంగాణ రాజకీయాల్లో తిట్ల పురాణం నడుస్తున్నది. అది ఇప్పట్లో ఖతమయ్యేలా కనిపిస్తలేదు. ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా బూతులు తిట్టుకుంటున్నారు. మరి మనం ఏ స్థానంలో ఉన్నాం. ఇలా మాట్లాడుకుంటే ప్రజలు ఏమనుకుంటారు? అని ఎవరూ ఆలోచించడం లేదు. అసలు ఇలా ఎవరైనా మాట్లాడుతారా? కాస్త అయినా పద్ధతి మార్చుకోవాలని ఎవరైనా సలహా ఇస్తే చాలు.. అసలు ముందు ఎవరు ప్రారంభించారు? మేం సరిగానే ఉన్నాం. మమ్మల్ని రెచ్చొగొట్టిన వారిని ముందు నిలదీయండి అంటూ నేతలు మరింత రెచ్చిపోతున్నారు. అధికారం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి నేతలు తమ నాలుకకు పని చెబుతున్నారు. అసలు దీనంతటికి కారణం ఎవరు?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు ముందు తెలంగాణ భవన్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మాటలు ఈ తిట్ల పురాణానికి ఆజ్యం పోశాయని చెప్పవచ్చు. ఇదే విషయాన్ని అధికారపార్టీ నేతలు సైతం గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనను రెండేండ్లుగా గమనిస్తూ ఉన్నానని, ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఇన్ని రోజులు ఓపిక పట్టామని ఇకమీదట అస్సలు వదిలేది లేదని మరో ప్రజాఉద్యమాన్ని సృష్టిస్తామని కేసీఆర్ అన్నారు. అంతటితో ఆగారా? లేదు.. ఒక్కొక్కరి తోలుతీస్తా.. చీరి చింతకు కడతా.. అని మంత్రులు,ముఖ్యమంత్రిని కలిపి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఇదే అంశం గత రెండు వారాలుగా హాట్ టాపిక్ అయ్యింది.
కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఆలస్యంగా స్పందించారు. అసెంబ్లీ సెషన్స్కు ముందు కోస్గిలో నిర్వహించిన సభలో కేసీఆర్ను గట్టిగానే అరుసుకున్న సీఎం.. అసెంబ్లీ సెషన్స్కు ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ హాజరుకాకుండా అటు పార్టీ సభ్యులను కూడా హాజరుకానివ్వకుండా సెషన్స్ను బహిష్కరించడంపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం ఇకనైనా మానుకోవాలని.. చేసిన తప్పులు ఒప్పుకునే ధైర్యం లేనప్పుడు సవాళ్లు విసరవద్దని పరోక్షంగా హెచ్చరించారు. అంతేకాకుండా ఇష్టానుసారంగా తోలుతీస్తా.. అది ఇది అని మాట్లాడితే నాలుక కోస్తాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అయితే, సీఎం భాషపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. హరీశ్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారుసైతం అసభ్యపదజాలం వాడటం మొదలెట్టారు.
Komatireddy: కవితకు సమాధానం చెప్పు హరీష్.. కోమటిరెడ్డి సూటి ప్రశ్నలు
సీఎం నోరు తెరిస్తే కంపు భాష మాట్లాడుతున్నారని హరీశ్ రావు, కేటీఆర్ విమర్శిస్తుండగా.. ముందు కేసీఆర్ను కంట్రోల్ చేయాలని, ఆయన తోలుతీస్తామని అన్నాకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుక కోస్తామని అన్నారంటూ టీపీసీసీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గుర్తుచేశారు. రాజకీయ నాయకులు హుందాగా ప్రవర్తించాలని పలువురు సూచిస్తుండగా.. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత స్థాయిలో ఉన్నవారు గౌరవం పెరిగేలా విమర్శలు చేయాలని ఇతర పార్టీల నేతలు హితవు పలుకుతున్నారు. ఎప్పుడూ వ్యక్తిగత దూషణ చేయడం సరికాదని అంటున్నారు.ఇకనైనా ఈ తిట్ల పురాణం తగ్గుతుందో లేదో అని మరికొందరు నేతల మధ్య చర్చ జరుగుతున్నది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య వైరం ఉండరాదని, సహాయ సహకారాలు, ప్రజా సమస్యల కోసం పనిచేయాలని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.