Vikarabad: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని దుర్గా గ్రాండియర్ రెస్టారెంట్ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. తాజాగా ఈ హోటల్కు వచ్చిన కొందరు కస్టమర్లు జంబో ప్యాక్ చికెన్ బిర్యానీని ఆర్డర్ చేశారు. తీరా ఆ ఆహారాన్ని తినబోతుండగా, అందులోని చికెన్ ముక్కల నుండి భరించలేనంత కుళ్లిన వాసన రావడంతో కస్టమర్లు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. నిల్వ ఉంచిన, నాణ్యత లేని మాంసంతోనే ఈ బిర్యానీ వండినట్లు వారు గుర్తించారు.
ఆహారం తినలేనంత దారుణంగా ఉండటంతో ఆగ్రహించిన కస్టమర్లు వెంటనే హోటల్ సిబ్బందిని, యాజమాన్యాన్ని నిలదీశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇదే హోటల్లో ఆహార నాణ్యత విషయంలో అనేక ఫిర్యాదులు వచ్చాయని, ఒకానొక సందర్భంలో బిర్యానీలో బొద్దింకలు కూడా దర్శనమిచ్చాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వరుస ఘటనలు జరుగుతున్నా యాజమాన్య తీరులో మార్పు రాలేదని వారు మండిపడుతున్నారు.
వినియోగదారుల ఫిర్యాదుల మేరకు ఈ హోటల్లో కుళ్లిన మాంసం, అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాల తయారీ జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. కేవలం లాభాలనే ధ్యేయంగా పెట్టుకున్న నిర్వాహకులు, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కుళ్లిన ఆహారాన్ని వడ్డించడం ద్వారా ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: రోడ్డుపైనే సర్జరీ.. ఈ వైద్య దంపతులు చేసిన పనికి సెల్యూట్ చేయాల్సిందే
ఈ సంఘటన నేపథ్యంలో ఆహార భద్రతా అధికారులు (Food Safety Officers) తక్షణమే స్పందించి హోటల్ను తనిఖీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న ఇటువంటి రెస్టారెంట్ల లైసెన్సులను రద్దు చేయాలని, కఠినమైన జరిమానాలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.