Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసులో.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక పెన్ డ్రైవ్ కీలక మలుపుగా మారింది. ఈ కేసులో ప్రధాన ఆధారంగా మారిన ఈ పెన్ డ్రైవ్ చుట్టూనే ప్రస్తుతం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) విచారణ కొనసాగుతోంది. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు విధుల్లో ఉన్న సమయంలోనే ఈ పెన్ డ్రైవ్లో ఫోన్ టాపింగ్కు సంబంధించిన.. కీలక సమాచారం స్టోర్ చేసినట్లు అధికారులు గుర్తించారు.
సిట్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ పెన్ డ్రైవ్లో వందల సంఖ్యలో ఫోన్ నంబర్లు నమోదై ఉన్నట్లు తేలింది. వీటిలో రాజకీయ నేతలు, ప్రముఖ జర్నలిస్టులు, అంతేకాదు హైకోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి ప్రొఫైల్ వివరాలు కూడా ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఈ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగేలా వ్యవహారం జరిగిందా? అనే కోణంలో సిట్ అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ పెన్ డ్రైవ్లోని డేటాను ప్రభాకర్ రావు ముందుంచి ఉంచి ప్రశ్నలు సంధిస్తున్నారు. టాపింగ్కు గురైన ఫోన్ నెంబర్లను గుర్తించడంలో ఈ డిజిటల్ ఆధారమే కీలకంగా మారిందని సిట్ భావిస్తోంది. ప్రభాకర్ రావు బృందం చాలావరకు ఆధారాలను ధ్వంసం చేసినప్పటికీ, ఈ పెన్ డ్రైవ్ను స్వాధీనం చేసుకోవడం సిట్కు పెద్ద బ్రేక్గా మారింది. కేసును నిరూపించేందుకు ఇది సాలిడ్ ఎవిడెన్స్ అని సిట్ అధికారులు స్పష్టంగా చెబుతున్నారు.
ప్రభాకర్ రావు విచారణ మరో రెండు రోజుల పాటు కొనసాగనుంది. ఎల్లుండి వరకు ఆయన నుంచి పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నంలో సిట్ ఉంది. ఇప్పటికే పలువురు అధికారులకు, సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి స్టేట్మెంట్లు నమోదు చేసింది. ప్రాథమిక ఆధారాలపైనే ప్రస్తుతం సిట్ ప్రధానంగా దృష్టి సారించింది.
ఈ విచారణలో మరో కీలక అంశంగా, మిగిలిన ఐదుగురు నిందితులను ప్రభాకర్ రావు ఎదురుగా కూర్చోబెట్టి వరుసగా ప్రశ్నిస్తున్నారు. వారి వాంగ్మూలాల్లో ఏవైనా విభేదాలు ఉన్నాయా? ఎవరి ఆదేశాలతో టాపింగ్ జరిగిందనే విషయాన్ని స్పష్టత చేయడమే లక్ష్యంగా సిట్ ముందుకు సాగుతోంది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి నుంచి కూడా.. సిట్ కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. కొన్ని ఫోన్ టాపింగ్ అంశాలను మావోయిస్టుల ఖాతాలో వేసి రివ్యూ కమిటీకి పంపిన వ్యవహారంలో.. ప్రభాకర్ రావు పాత్ర ఏమిటన్న దానిపై విచారణ సాగుతోంది. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల ప్రమేయం ఉందా? వారి మధ్య కమ్యూనికేషన్ ఎలా జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతోంది.
ఫోన్ సంభాషణల ద్వారానే ఆదేశాలు అందాయా? లేక వాట్సాప్ సందేశాల రూపంలో సూచనలు ఇచ్చారా? అనే అంశాలపై కూడా సిట్ ఫోకస్ పెట్టింది. ఈ కోణంలో మరింత లోతుగా వెళ్లేందుకు కోర్టు అనుమతి తీసుకుని ముందుకు వెళ్లాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: శరవేగంగా మేడారం జాతర పనులు.. డ్రోన్ విజువల్స్
ఈ రెండు రోజులు ఈ కేసులో అత్యంత కీలకంగా మారనున్నాయని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు, ఈ నెల 26న ప్రభాకర్ రావును విడిచిపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, అంతకు ముందు విచారణను పూర్తి చేయడంపై సిట్ వేగం పెంచింది. జనవరి 16న ఫోన్ టాపింగ్ కేసుపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరగనుంది.