RTC Strike in Telangana: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తీవ్రమవుతుందా? ఎన్నిరోజులు వరకు కొనసాగవచ్చు? ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారా? బుధవారం ఉదయం ఆరు గంటలకు బస్సులు డిపోలకు పరిమితమయ్యాయా? బస్సులు లేకపోవడంతో బస్సు, రైల్వే స్టేషన్లలో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయా? ప్రైవేటు వాహనాల దోపిడీ మొదలైందా? అవుననే అంటున్నారు ప్రజలు.
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె.. డిపోలకు చేరిన బస్సులు
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మొదలైంది. కార్మికుల సమ్మెతో బస్సులు డిపోల వద్ద నిలిచిపోయాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి బస్సులు డిపోలకు చేరుకున్నాయి. నైట్ బస్సులు బుధవారం ఉదయం ఆరు గంటలకు డిపోలకు చేరుకున్నాయి. ఇవాళ ఉదయం అన్ని డిపోల ముందు ఆందోళనకు సిద్దమవుతున్నారు ఆర్టీసీ కార్మికులు. డ్యూటీలకు వెళ్లకుండా కార్మికులు నిరసనలో పాల్గొన్నారు.
బుధవారం ఉదయం గన్పార్క్ వద్దకు వెళ్లనున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని డిపోల్లో బస్సులు కదల్లేదు. హైదరాబాద్లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్స్టేషన్ సహా జిల్లా కేంద్రాల్లోని బస్సుస్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. బస్సులు ఆగిపోవడంతో ఉదయం నుంచి డ్యూటీలకు వెళ్లాల్సినవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు.. దోపిడీ మొదలుపెట్టిన ప్రైవేటు వాహనదారులు
ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కక పోవడంతో సామాన్యులు ఇక్కట్లు మొదలయ్యాయి. గంటల తరబడి బస్టాండ్లలో వేచిచూస్తున్నారు. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి ఆటోలు, క్యాబ్లు. దీంతో ఛార్జీలను అమాంతం పెంచేశాయి. నార్మల్ రోజుల్లో ఎల్బీనగర్-సికింద్రాబాద్కు ఆటో ఛార్జీ రూ. 150 నుంచి 200 ఉండేది. ఏకంగా రూ.400-500 డిమాండ్ చేస్తున్నారు.
మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలికి వెళ్లాలంటే ఆటోలు రూ.200 డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ ప్రశ్నిస్తే వినియోగదారులను ఆటోల నుంచి దించేస్తున్న సందర్భాలు కనిపించాయి. హైదరాబాద్ సిటీలో ఎలక్ట్రిక్ వాహనాలు తిరుగుతున్నాయి. వాహనాలు తక్కువగా ఉండడంతో అవి ఏ సమయానికి వస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడింది.
ALSO READ: కుషాయిగూడలో రైతుల ధర్నా.. న్యాయం చేయాలని డిమాండ్..!
మరోవైపు కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. ఉద్యోగులు విధులకు హాజరుకావాలని సూచన చేశారు. కార్మికుల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కొన్ని సంఘాలు నిజాలను విస్మరించి కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు.
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడే అవకాశముంది. రోజువారీ కూలీలు, మధ్య దిగువ తరగతి ప్రజలు, అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లేవారు ఉన్నారు. మరోవైపు మెట్రో రైళ్లలో ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. సాధారణం కంటే ఎక్కువ ట్రిప్పులు నడపాలని మెట్రో అధికారులను ప్రభుత్వం కోరినట్టు తెలుస్తోంది. దీనికితోడు ఎంఎంటీఎస్ రైళ్లను వినియోగించుకోవాలని సూచన చేస్తున్నారు.