Hyderabad Umrah Pilgrims Dead: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కా దర్శనం కోసం వెళ్లిన భారతీయ యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైన ఘటనలో ఏకంగా 42 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ బస్సు ప్రమాదంలో ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అతడిని హైదరాబాద్ కు చెందిన 24 ఏళ్ల మొహమ్మద్ అబ్దుల్ షోయాబ్ గా గుర్తించారు. ప్రమాద సమయంలో అతడు డ్రైవర్ పక్కన కూర్చున్నట్లు తెలుస్తోంది. అతడిపై ప్రమాద తీవ్రత అంతగా పడకపోవడంతో గాయాలతో బతికి బయటపడినట్లు సమాచారం. వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది, అతడిని హాస్పిటల్ లో చేర్పించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి ఏంటనేది మాత్రం తెలియదు. ఈ ప్రమాదంలో షోయబ్ కుటుంబానికి చెందిన 8 మంది సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది.
ఆదివారం తెల్లవారుజామున 1:30 గంట సమయంలో మక్కాకు వెళ్తున్న భారతీయ యాత్రికుల బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్నది. ఆ సమయంలో బస్సులో 43 మంది ఉన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే జెడ్డాలోని భారత హైకమిషన్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “రియాద్లోని మా రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్ ఈ ప్రమాదంలో ప్రభావితమైన భారతీయ పౌరులు, వారి కుటుంబాలతో టచ్ లో ఉన్నాం. అన్ని వివరాలను ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాం. తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
అటు ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యాత్రికులు మక్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరిగిందన్నారు. ఈ బస్సులో హైదరాబాద్ నివాసితులు కూడా ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవడంతో పాటు బాధిత కుటుంబాలతో టచ్ లో ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని సీఎంవో ఆదేశించింది. ఈ సంఘటనకు సంబంధించి విదేశాంగ మంత్రిత్వ శాఖ, సౌదీ రాయబార కార్యాలయాన్ని సంప్రదించి, అవసరమైన సహాయ చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. “ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణారావు ఢిల్లీలోని సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ తో మాట్లాడి అవసరమైన ఆదేశాలు జారీ చేశారు” అని తెలిపింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు, సహాయ చర్యలను నిరంతరం పర్యవేక్షించడానికి, బాధిత కుటుంబాలు, బంధువులకు సమాచారం అందించడానికి సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. త్వరలోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉన్నట్లు సీఎంవో వివరించింది.
Read Also: బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్బ్రాంతి.. కంట్రోల్ రూమ్ నెంబర్లు ఏర్పాటు