Operation Khazana: స్వేచ్ఛ బ్యూరో: నిన్న మొన్నటి వరకు మావోయిస్టుల కోసం కూంబింగులు జరిపిన భద్రతా బలగాలు ప్రస్తుతం బంగారం వేటలో పడ్డాయి. ఆపరేషన్ ఖజానా పేరుతో మావోయిస్టులు డంపుల్లో దాచి పెట్టిన బంగారాన్ని బయటకు తీసేందుకు చర్యలకు శ్రీకారం చుట్టాయి. దీని కోసం ఇస్రో శాటిలైట్లు, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్లను ఉపయోగిస్తున్నాయి. మార్చి 31వ తేదీలోపు దేశంలో మావోయిస్టు పార్టీని తుడిచి పెట్టాలన్న లక్ష్యంతో ఆపరేషన్ కగార్ ను కొనసాగించిన కేంద్ర ప్రభుత్వం దాదాపుగా లక్ష్యాన్ని సాధించింది.
ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో అగ్రనేతలు వేళ్ల మీద లెక్కబెట్టేంత సంఖ్యలో మాత్రమే మిగిలారు. క్యాడర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. చాలామంది అగ్రనేతలు వేర్వేరు రాష్ట్రాల పోలీసుల ఎదుట లొంగిపోయారు. వందల సంఖ్యలో క్యాడర్ కూడా సరెండర్ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ఉనికి నామమాత్రంగా మారింది. సరెండర్ అయిన మావోయిస్టు పార్టీ అగ్రనేతలు, క్యాడర్ ఆయుధాలను అప్పగించారు తప్పితే డంపులకు సంబంధించిన వివరాలను పెద్దగా వెల్లడించలేదు. ఈ డంపుల్లో రెండు వందల కిలోలకు పైగా బంగారం ఉన్నట్టుగా భద్రతా బలగాలు భావిస్తున్నాయి. పార్టీలో క్రియాశీలకంగా పని చేసినపుడు మావోయిస్టులు కాంట్రాక్టర్లు, బడా వ్యాపారులతోపాటు పలువురి నుంచి కోట్లాది రూపాయల నిధులను సేకరించిన విషయం తెలిసిందే.
Also Read: ప్రకాష్ రాజ్కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..
ఈ డబ్బును డంపుల్లో భద్రపరిచారు. అయితే, కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయటం మావోయిస్టు పార్టీకి శరాఘాతమైంది. దగ్గర ఉన్న నోట్లను మార్పిడి చేసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం గడువు ఇచ్చిన సమయంలో డంపుల్లో దాచి పెట్టిన కరెన్సీని బయటకు తీసి మావోయిస్టులు బంగారంగా మార్చాయి. బంగారం అయితే ఎప్పటికీ విలువ తగ్గదని, పైగా ధర పెరుగుతూనే ఉంటుందని భావించి ఇలా చేశారు. ఇలా సేకరించిన దాదాపు రెండు వందల కిలోలకు పైగా బంగారం దండకారణ్యంలోని మావోయిస్టుల డంపుల్లో ఉన్నట్టుగా భద్రతా బలగాలు ఇప్పటికే నిర్ధారించుకున్నాయి. ఈ క్రమంలోనే ఆ బంగారాన్ని బయటకు తీసే చర్యలు మొదలు పెట్టాయి. దీని కోసం ఇస్రో శాటిలైట్లు, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్లను ఉపయోగించుకుంటూ గాలింపు జరుపుతున్నాయి.
Also read: భారత ఆటో రంగంలో సరికొత్త అధ్యాయం.. ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాగన్ ఆర్ విడుదల!