Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన కీలక పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర నిధుల సాధనపై ఎంపీలతో ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారం ఉంటేనే తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించగలమని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అనుమతుల కోసం బీజేపీ ఎంపీలు సైతం చొరవ చూపాలని కోరారు.
హైదరాబాద్కు ఐఐఎం, మెట్రో విస్తరణ
హైదరాబాద్ నగరానికి ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM)ను తీసుకురావడానికి బీజేపీ ఎంపీలు ప్రత్యేకంగా చొరవ చూపాలని ముఖ్యమంత్రి కోరారు. అలాగే, నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు మెట్రో విస్తరణ పనులు ఎంతో కీలకమని, ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని తెలిపారు. మెట్రో విస్తరణకు సంబంధించిన రుణాల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు.
ఆర్ఆర్ఆర్, మూసీ పునరుజ్జీవం
రీజినల్ రింగ్ రోడ్ (RRR)కు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ దాదాపు ఒక కొలిక్కి వచ్చిందని సీఎం వెల్లడించారు. కేంద్రం నుంచి అవసరమైన నిధులను త్వరితగతిన తెచ్చుకుని ఆర్ఆర్ఆర్ నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. వీటితో పాటు మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ‘అర్బన్ ఛాలెంజ్ ఫండ్’ అనుమతులు వచ్చేలా అందరూ కృషి చేయాలని కోరారు.
Also Read: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సోషల్ మీడియా తుఫాన్.. అసలు నిజమిదే!
సాగునీటి ప్రాజెక్టులు.. ఏపీ నుంచి ఎన్ఓసీ
ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) రావాల్సి ఉందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. డిండి ప్రాజెక్టు (30 టీఎంసీలు), పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (90 టీఎంసీలు) కలిపి మొత్తం 120 టీఎంసీల నీటి వినియోగానికి ఏపీ నుంచి అనుమతులు రావాలన్నారు. ఈ ఎన్ఓసీ అంశం ప్రస్తుతం చర్చల దశలో ఉందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపి అనుమతులు ఇప్పిస్తే ఈ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్తో ఈ విషయమై చర్చించినట్లు తెలిపారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు.
కేంద్ర అనుమతులు, భేషజాలు లేవు
ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాల ఏర్పాటు, తుమ్మిడిహట్టి ప్రాజెక్టు, పోర్ట్ కనెక్టివిటీ, బుల్లెట్ ట్రైన్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సంబంధించిన కేంద్ర అనుమతులను వీలైనంత త్వరగా సాధించుకోవాలని సీఎం చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే.. ఆ విషయాన్ని తాము నిరభ్యంతరంగా, బహిరంగంగా ఒప్పుకుంటామని, ఇందులో తమకు ఎలాంటి రాజకీయ భేషజాలు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read: కాంగ్రెస్ స్కెచ్, బీఆర్ఎస్ కౌంటర్, బీజేపీ రివర్స్ ఎటాక్.. కాళేశ్వరం చదరంగంలో అసలు గెలిచేదెవరు?