Illegal Constructions: స్వేచ్చ బ్యూరో: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీ రామేశ్వరం బండలో అక్రమ నిర్మాణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మున్సిపల్ కార్యాలయం వెనకాలే అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భవన నిర్మాణాలకు తప్పనిసరిగా ఉండాల్సిన అనుమతులు, సెట్బ్యాక్లు, పార్కింగ్, భద్రతా ప్రమాణాలను పక్కనబెట్టి నిర్మాణాలు కొనసాగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అక్రమ నిర్మాణాలు పూర్తయ్యే వరకు అధికారులు మౌనం పాటించి, తర్వాత జరిమానాలతో సరిపెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ కార్యాలయానికి సమీపంలోనే నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు సాగుతున్నా చర్యలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
అధికారులు తెలిసీ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారా? లేక అక్రమ నిర్మాణాలకు అండదండలు ఉన్నాయా? అనే ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి. నిర్మాణ ప్రమాణాలు పాటించకుండా భవనాలు నిర్మించడం వల్ల భవిష్యత్తులో ప్రమాదాలు జరిగే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్, టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రత్యేక విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Also read: Chandrababu Fan: సీఎం చంద్రబాబుని కలిసేందుకు 13 ఏళ్ల బాలుడు సాహసం.. ఎవరికి చెప్పకుండా..!