Etala Rajender: స్వేచ్ఛ బ్యూరొో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నారని, ఈ పద్ధతి మానుకోవాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. రిటైర్డ్ ఇంజినీర్లపై ఆయన చేసిన వ్యాఖ్యలపై సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘కరువు వర్సెస్ కాళేశ్వరం’, ‘కన్నెపల్లి నుంచి నీటి తరలింపు సాధ్యమా?’ అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఈటల రాజేందర్ హాజరై మాట్లాడారు. 2023లో లక్మీ బరాజ్ పిల్లర్లు కుంగిపోయాయని, ఇంజినీర్లు తప్పు డిజైన్ ఇస్తే వారిని, కాంట్రాక్టర్ తప్పుచేస్తే వారిని, పాలకులు అహంకారంతో ఇంజినీర్లు, కాంట్రాక్టర్లను ఇన్ఫ్లుయెన్స్ చేశారని ప్రూవ్ అయితే వారిని కూడా శిక్షించాలని ఈటల డిమాండ్ చేశారు.
తాము ఏ పార్టీకి సపోర్ట్ కాదని, రైతులకు, ప్రజలకు, న్యాయానికి, ధర్మానికి సపోర్ట్ అని పేర్కొన్నారు. ఎస్ఆర్ఎస్పీ 90 టీఎంసీ ప్రాజెక్ట్ అని, ఎల్ఎండీ 24 టీఎంసీల ప్రాజెక్ట్ అని, 24 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి డిజైన్ చేశారన్నారు. కానీ ఏనాడు 10-12 లక్షలకు మించి నీళ్లు అందలేదని, వరంగల్ దాటలేదని ఈటల తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ కూలిందని, అన్నారం సుందిళ్ల పనికి రాదని, ఎన్డీఎస్ఏ చెప్పిందని చెబుతున్నారని, కానీ నిష్ణాతులు చెప్తున్న మాటలు వినే సోయి ఆయనకు లేకుండాపోయిందన్నారు.
సమైక్యాంధ్రలో కూడా సీఎంలు సమన్వయంతో సమాధానం చెప్పారని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం అడ్డగోలుగా మాట్లాడడం ప్రజలను కుంగదీస్తోందన్నారు. ఈరోజు ప్రజలు మాట్లాడకపోవచ్చని, కానీ సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి గుణపాఠం చెబుతారని స్పష్టంచేశారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా సీఎం.. మొండిగా, గుడ్డిగా, అజ్ఞానంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం కాపర్ డ్యాం కట్టే ప్రయత్నం ఎందుకు చేయలేదని ఈటల ప్రశ్నించారు. బెల్ట్ తో కొడతా అనడం, జైళ్లో పెడతా అనడం, రక్తం చల్లుతానానడం అనే మాటలు సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని విమర్శించారు. తమకు ప్రజల ఆశీర్వాదం ఉందని, రేవంత్ తిట్లు తమను ఏమీ చేయలేవన్నారు.
Also Read: Chandrababu Fan: సీఎం చంద్రబాబుని కలిసేందుకు 13 ఏళ్ల బాలుడు సాహసం.. ఎవరికి చెప్పకుండా..!
ఇదిలాఉండగా కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న ఇష్యూస్ పై ఎంపీలతో ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర బీజేపీ ఆదేశాల మేరకు ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ పలు అంశాలపై మాట్లాడారు. నిధుల కేటాయింపులో కేంద్రం వివక్షత లేదన్నారు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద రాష్ట్రానికి నిధులు రావాలంటే రాష్ట్రం వాటా విడుదల చేయాలని, ఇది చేయకపోవడం వల్ల చాలా నిధులు పెండింగ్ లో ఉన్నాయన్నారు.
దీనిని అధిగమించడానికి సీఎస్ఎస్ కోసం తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. దీనివల్ల విద్య వైద్య రంగాల్లో అత్యధిక నిధులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయని అధికారులు వివరించారు. అలాగే రూ. 200 కోట్లు స్పెషల్ ఇన్సెంటివ్ నిధులు కేంద్రం అందించిందని తెలిపారు. రేషన్ కార్డులు ఉన్న అందరికీ ఆయుష్మాన్ భవ పథకం వర్తించేలా చూడాలని ఈటల రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధాన్యం దిగుబడి పెరుగుదలకు అనుగుణంగా మిల్లింగ్ కెపాసిటీ పెరగడం లేదని, క్లస్టర్ వారీగా ఎక్కడ కెపాసిటీ తక్కువ ఉంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ అందించాలని డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణ విషయంలో పూర్తిగా కేంద్రంపై ఆధారపడకుండా ప్రత్యాన్మాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
రైస్ మిల్లుల్లో ధాన్యం బయటే నిల్వ చేయడం వల్ల తడిచి రంగు మారుతున్నాయని, స్టోరేజ్ కెపాసిటీ పెంచాలన్నారు. ఎంపీలకు గౌరవం ఉండేలా చూడాలని, ఇందిరమ్మ ఇళ్లలో ఎంపీలు ఇచ్చిన సిఫార్సులకు కూడా కేటాయింపులు చేయాలని ఈటల సూచించారు. ప్రభుత్వమంటే కేవలం అధికార పార్టీ వారు మాత్రమే కాదని గుర్తుపెట్టుకోవాలన్నారు. తెలంగాణ కోసం.. అధికార పార్టీలో ఉండి కూడా పార్లమెంట్లో ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నామన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావడానికి తమ వంతు సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామని ఈటల రాజేందర్ ఈ సమావేశంలో తెలిపారు.
Also read: బంగాళాఖాతంలో పడవ బోల్తా.. 9 మంది మత్స్యకారులు మృతి, ఆరుగురి గల్లంతు!