Hyderabad Latest News(Local news telangana):
నిరుద్యోగులే టార్గెట్గా ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. పార్ట్టైం జాబ్స్, ఇన్వెస్ట్మెంట్ పేరుతో నిరుద్యోగులకు గాలం వేసి మోసాలకు పాల్పడుతున్న యువతి ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ఢిల్లీకి చెందిన శృతి మయూర్ బఫ్నా అనే యువతిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు.
పార్ట్ టైం జాబ్స్, ఇన్వెస్ట్మెంట్ పేరుతో అనేక మందికి గాలం వేసింది శృతి మయూర్. కేవలం రివ్యూ ఇవ్వడంతోనే ఇంటిపట్టునే ఉండి డబ్బులు సంపాదించవచ్చని పలువురికి వాట్సాప్, టెలిగ్రామ్లో మెసేజ్లు పెట్టింది. చాలా మంది వద్ద నుంచి వారి బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించింది. ఈ వివరాలు సైబర్ నేరగాళ్లకు చేరవేసి.. సొమ్ము చేసుకుంటుంది. ఇవే కాకుండా పెట్టుబడుల పేరుతో కూడా ఎంతో మందిని మోసం చేసింది. ఇన్వెస్ట్మెంట్ పేరుతో దాదాపు 3 కోట్లకుపైగా కుచ్చుటోపి పెట్టింది శృతి మయూర్.
శృతి మయూర్ మాయమాటలు నమ్మిన హైదరాబాద్ పద్మారావునగర్కు చెందిన వ్యక్తి.. పెట్టుబడి పెట్టాడు. దాదాపు 21 లక్షలు కిలాడీ లేడీ కొట్టేయడంతో.. మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కిలాడీ లేడీని అదుపులోకి తీసుకున్నారు. తీగ లాగితే డొంక కదిలిన విధంగా.. శృతి మయూర్పై మొత్తంగా 25 కేసులు నమోదైనట్లు తేలింది. తెలంగాణలో 3 కేసులు నమోదైనట్లు చెబుతున్నారు పోలీసులు.
తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వస్తాయనే అత్యాశకు పోయి.. తెలియని వ్యక్తులను నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు పోలీసులు. వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా వచ్చే గుర్తు తెలియని లింకులను కూడా క్లిక్ చేయోద్దని.. ఎవరికీ కూడా మీ బ్యాంక్ ఖాతాల వివరాలు ఇవ్వొద్దని.. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.