బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలకు సిట్ వణుకు పుట్టిస్తున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొన్నటివరకు విచారణ జరిపిన సిట్ అధికారులు తాజాగా మాజీ మంత్రి, అసెంబ్లీ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్కు నిన్న రాత్రి నోటీసు జారీ చేశారు.నేడు ఉదయం విచారణకు హాజరు కావాలని కోరారు. ఓ మీడియా చానెల్ ఎండీ సిట్ విచారణలో హరీశ్ రావు ప్రస్తావించినందున ఆయన్ను విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు పంపినట్టు తెలుస్తున్నది. ఇదిలాఉంటే హరీశ్ రావు విచారణ అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు రావొచ్చని రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నందుకే సిట్ను అడ్డం పెట్టుకుని కక్షసాధింపు చర్యలకు సీఎం రేవంత్ దిగుతున్నారని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు.
హరీశ్ రావుకు సిట్ నోటీసులు పంపించిందని తెలియగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.‘ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావు పాత్ర ఉందంటూ ఆయన్ను విచారణకు అనుమతించాలని కోరుతూ గతంలో సుప్రీంకోర్టులో సిట్ దాఖలు చేసిన పిటిషన్ కొట్టుడు పోయినా.. మళ్లీ నోటీసుల పేరుతో డ్రామా ఆడుతున్నారని’ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తమను విచారణల పేరిట ఇబ్బంది పెట్టాలని చూసినా వెనకడుగు వేసేది లేదని.. ఏ విచారణకు అయినా సిద్ధమని.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన వ్యక్తిని విచారణల పేరిట ఇబ్బంది పెట్టాలని చూడటం సరికాదని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు.
నైనీ బొగ్గు గనుల్లో రవాణా టెండర్ల స్కాంపై హరీశ్ రావు ఉదయం మాట్లాడగానే సాయంత్రానికి సిట్ నోటీసులు ఇవ్వడం దేనికి సంకేతం అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇదే విషయాన్ని హరీశ్ రావు సైతం నేడు ఉదయం సిట్ విచారణకు వెళ్లే ముందు మీడియాకు వివరించారు. రేవంత్ బావమరిది భారీ కుంభకోణానికి తెరతీయగా.. తాము అడ్డుకున్నామనే కోపంతోనే సీఎం రేవంత్ తమ మీద కక్ష సాధింపు చర్యలకు దిగారని ఆరోపించారు. ఇదిలాఉండగా, హరీశ్ రావుకు సంఘీభావంగా కేటీఆర్, పలువురు కీలక నేతలు ఉదయం ఆయన ఇంటికి వెళ్లారు.
విచారణకు హాజరైన హరీశ్ రావు మీద సిట్ ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి..రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావుకు మీకు గల అనుబంధం ఏమిటి? మీడియా చానెల్ వ్యక్తి శ్రవణ్ రావు మీ పేరు ఎందుకు విచారణలో చెప్పారు? ట్యాపింగ్ పరికరాలు ఎవరు సమకూర్చారు వంటి ప్రశ్నలను సిట్ బాస్ సజ్జన్నార్ అధ్వర్యంలో అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. కాగా, హరీశ్ రావు స్టేట్మెంట్ ఆధారంగా తుది చార్జిషీట్ను సిట్ ఫైల్ చేసి ప్రభుత్వానికి అందజేయనున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు ఈ కేసు విషయంలో కేటీఆర్ను విచారించే అవకాశం లేకపోలేదని.. త్వరలోనే ఆయనకూ నోటీసు అందే చాన్స్ ఉందని టాక్ వినిపిస్తున్నది. కాగా,మున్సిపల్ ఎన్నికల ముందు సిట్ దెబ్బకు బావబామ్మర్దులు సైలెంట్ అయిపోతారా? ప్రభుత్వాన్ని శరణు కోరతారా? అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతున్నది.