అసలే ఆ అధ్యక్షుడంటే పడటం లేదు కాషాయ టీంకు. ఆయన రాకతో పార్టీ మరింత దీనంగా తయారయిందనే కామెంట్లూ వస్తున్నాయి అక్కడి నుంచి. వీధి పోరాటాలు చేయకున్నా.. ప్రజలతో సత్సబంధాలు లేకున్నా సోషల్ మీడియానే వేదిక చేసుకుని పోరాడుతున్నారు చాలా మంది స్వచ్చంధంగా. హిందూత్వం, బీజేపీ మూలాలను బలపర్చాలనే ఒకే ఒక లక్ష్యంతో సోషల్ మీడియాలో బీజేపీ యాక్టివిస్టులు బలంగా పనిచేస్తున్నారు.
ఓ వైపు అధ్యక్షుడి ఎంపి అసంతృప్తిని రగిలిస్తుండంగా.. తాజాగా ఆయన చేసిన కామెంట్లు ఆ అగ్నికి ఆజ్యం పోసినట్టే అయ్యింది. ఇటీవల ఓ మీటింగులో బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు.. ఆ పార్టీ సోషల్ మీడియాకు హితబోధ చేసే కామెంట్లు చేశాడు. సోషల్ మీడియాలో ఏది పడితే అది రాయొద్దని, కామెంట్లు పెట్టొద్దని, లైన్ దాటొద్దని క్లాస్ తీసుకున్నాడు. హద్దు మీరితే చర్యలు తప్పవనే వార్నింగ్ కూడా ఇచ్చేశాడు. దీంతో భగ్గుమన్నది ఆయనపై ఆ కాషాయ టీం. అసలే పార్టీ పరిస్థితి అంతంతే ఉన్నది.
దీన్ని ఎట్లైనా బలోపేతం చేయాలని జాకీలు పెట్టి మరీ లేపుతుంటే.. మాకే మీరు ఉపదేశిస్తారా? లైన్ దాటొద్దని మాకే నీతులు చెబుతారా? అని మండిపడుతున్నారు. స్వచ్చంధంగా మేము పార్టీ బలోపేతం కోసం పాటుపడుతున్నామని, బీజేపీకి మైలేజీ ఇచ్చే , తెచ్చే ఏ అంశాన్నీ వదలకుండా పోస్టులు, కామెంట్లు చేస్తున్నామని .. ఇది గుర్తించకపోగా.. తగిన గుర్తింపు ఇవ్వకపోగా… నీతులు చెప్పి.. అల్టిమేటం ఇస్తారా? అని అధ్యక్షుడి తీరుపై మండిపడుతున్నారు. గ్రూపులు, విబేధాలతో ఇప్పటికే ఆ పార్టీ జనంలో బలంగా నిలవడం లేదు. జనం కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్న రాష్ట్ర బీజేపీ ఉనికినే మేం కాపాడుతున్నాం.. అని రేంజ్లో అధ్యక్షుల వారికి అదే సోషల్ మీడియా వేదికగా కాషాయ టీం, సానుభూతిపరులు కౌంటర్లిచ్చారు. ఇప్పుడు ఇది బీజేపీ రాష్ట్ర పార్టీలో చర్చకు తెర లేపింది.
ఇప్పటికే పలువురు నేతలు బీఆరెస్, బీజేపీ కలవబోతున్నాయి… పొత్తు పెట్టుకోబోతున్నాయని భాహాటంగానే ప్రకటించుకుంటున్న వేళ.. పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతూ వస్తుంది. నేతల్లో సఖ్యత లేదు. ఐక్యత లేదు. దీనికి తోడు ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలకు రాష్ట్ర పార్టీ నుంచి పిలుపులే లేవు. ఎప్పుడు ఏం చేయాలో తెలియక జిల్లాల్లో, పల్లెల్లో కాషాయదళం నిస్తేజంగా ఉండిపోతున్నది. సోషల్ మీడియా ద్వారానే ఎవరికి వారు తమ తమ అభిప్రాయాలను, ఖండనలను పోస్టు చేస్తూ పార్టీని కొంచెం కొంచెంగా ఉనికిలో ఉంచుతున్నారు. దీనిపై అధ్యక్షుల వారు నెగిటివ్గా స్పందించడం ఏంటీ? తను చేయాల్సిన పని తను చేయకుండా.. తాము చేసే పనిలో కూడా అడ్డం పడటం మూలంగా పార్టీకి మేలు కాదు కదా.. నష్టమే జరుగుతుందనే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు బీజేపీ సానుభూతిపరులు.