Adluri Laxman Kumar: స్వేచ్ఛ బ్యూరో: విద్యార్థుల సమస్యలకు అండగా నిలిచిన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైన చర్య అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు.ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకకు విలువ ఉండాలని, ముఖ్యంగా విద్యార్థుల ఆవేదనను వినిపించే హక్కును అడ్డుకోవడం ఏ విధంగానూ సమర్థనీయం కాదని మంత్రి పేర్కొన్నారు.
సమస్యలను వినడం, వాటికి పరిష్కారం చూపడం ప్రభుత్వాల బాధ్యతే తప్ప, ప్రశ్నించే స్వరాలను నిర్బంధించడం ప్రజాస్వామ్య సంస్కృతికి విరుద్ధమని అన్నారు.విద్యార్థుల భవిష్యత్తు, విద్యా వ్యవస్థ, సామాజిక న్యాయానికి సంబంధించిన అంశాలపై స్పందించడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అని పేర్కొన్న మంత్రి, ఆ బాధ్యతను నిర్వర్తించిన ప్రతిపక్ష నాయకుడిపై తీసుకున్న చర్యలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.
రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, శాంతియుత నిరసన హక్కులను గౌరవించడం ప్రతి ప్రభుత్వానికి కనీస బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను అణచివేయడం ద్వారా కాదు, ప్రజలతో సంభాషించడం ద్వారా మాత్రమే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
‘ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలను గౌరవించడం పరిపాలనా పరిణతి. ప్రశ్నించే వారిని అరెస్టులతో భయపెట్టే ప్రయత్నాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏమాత్రం మంచివి కావు. ప్రజల స్వరం ఎప్పటికీ నిలిచిపోదు’ అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.విద్యార్థుల ఆకాంక్షలు, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని మంత్రి అడ్లూరి స్పష్టం చేశారు.
Also Read: అధికారం పోయినా అహంకారం తగ్గలేదు.. కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి వాకిటి శ్రీహరి!