హైదరాబాద్లోని ఉప్పల్ బగాయత్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కాలికి గాయాలయ్యాయి. కార్యక్రమ స్థలంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల మధ్య తలెత్తిన ఘర్షణ చినికి చినికి గాలివానలా మారి.. చివరకు మంత్రికి గాయం కావడానికి దారితీసింది.
వివరాల ప్రకారం.. ఉప్పల్ బగాయత్ పరిధిలో జరుగుతున్న ఒక అభివృద్ధి కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించాయి. దీనికి ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పోటాపోటీగా నినాదాలు చేయడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కాస్తా తోపులాటకు దారితీసింది.
మంత్రి శ్రీధర్ బాబుకి గాయం
ఉప్పల్ బగాయత్ లో ఘటన
అభివృద్ధి కార్యక్రమంలో బీఆర్ఎస్-కాంగ్రెస్ నాయకుల నినాదాలు
పోటాపోటీ నినాదాలతో తోపులాట
తోపులాటలో మంత్రి శ్రీధర్ బాబు కాలికి గాయం
Minister Sridhar Babu injured. Incident in Uppal Bhagayat. BRS-Congress leaders raised slogans… pic.twitter.com/8ynRxOC5vG
— BIG TV Breaking News (@bigtvtelugu) February 10, 2026
ఈ క్రమంలో ఇరు వర్గాలను నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ.. పరిస్థితి అదుపు తప్పింది. జనం ఒక్కసారిగా తోసుకురావడంతో మంత్రి శ్రీధర్ బాబు కింద పడిపోయారు. ఈ తోపులాటలో ఆయన కాలికి బలమైన గాయం తగిలింది. వెంటనే గమనించిన భద్రతా సిబ్బంది మరియు పార్టీ ముఖ్య నేతలు ఆయన్ను పక్కకు తీసుకెళ్లారు. గాయం తీవ్రత దృష్ట్యా ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు.
రాజకీయ వైషమ్యాల కారణంగా అభివృద్ధి కార్యక్రమాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు ఉన్నప్పటికీ.. ఇరు పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగడంతో ఉప్పల్ ప్రాంతంలో కొంతసేపు భీభత్సమైన వాతావరణం నెలకొంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ.. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.