
Jagitial : జగిత్యాల జిల్లా కోరుట్లలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఆమె మరణం మిస్టరీగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమునిదుబ్బ ప్రాంతంలో బంక శ్రీనివాస్రెడ్డి, మాధవి దంపతులు నివాసముంటున్నారు. వారికి ముగ్గురు పిల్లలున్నారు. వారిలో పెద్దమ్మాయి దీప్తి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్నారు. రెండో అమ్మాయి చందన బీటెక్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె ఇంటి వద్దే ఉంటోంది. కుమారుడు సాయి బెంగళూరులో డిగ్రీ చేస్తున్నాడు.
బంధువుల గృహప్రవేశం కార్యక్రమం కోసం శ్రీనివాస్రెడ్డి, మాధవి హైదరాబాద్కు వెళ్లారు. సోమవారం రాత్రి 10 గంటలకు కుమార్తెలతో ఫోన్లో మాట్లాడారు. మంగళవారం మధ్యాహ్నం దీప్తికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. చందన ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. దీంతో కంగారు పడి తల్లిదండ్రులు పక్కింటి వారికి విషయం చెప్పారు. వారు ఆ ఇంటికి వచ్చి దీప్తి మృతి చెంది ఉండటంతో షాక్ అయ్యారు. రెండో కుమార్తె చందన ఇంట్లో లేదని గుర్తించారు.
ఈ సమాచారం తెలియగానే డీఎస్పీ రవీందర్రెడ్డి, కోరుట్ల, మెట్పల్లి సీఐలు ప్రవీణ్కుమార్, లక్ష్మీనారాయణ, ఎస్ఐ కిరణ్కుమార్ ఘటనా స్థలానికి వచ్చారు. దీప్తి సోఫాలో అనుమానాస్పదంగా మృతిచెంది ఉంది. కిచెన్ రూమ్ లో 2 మద్యం సీసాలు, కూల్డ్రింక్ బాటిల్, తినుబండారాల ప్యాకెట్లను గుర్తించారు.
చందన ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బస్టాండ్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. చందన, మరో యువకుడితో కలిసి ఉదయం 5.12 – 5.16 గంటల మధ్య నిజామాబాద్ బస్సులు ఆగేచోట కూర్చున్నారని గుర్తించారు. ఆ తర్వాత నిజామాబాద్ వెళ్లే బస్సులో ఎక్కినట్లు సీసీ కెమెరా దృశ్యాల ద్వారా తేలింది. చందనతోపాటు ఆ యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెల్లి చందన ఆచూకీ తెలిస్తేనే దీప్తి మృతి మిస్టరీ వీడుతుంది.