Cabinet Expansion: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో త్వరలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయనే వార్తలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేవలం ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయడమే కాకుండా, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారి శాఖలను కూడా మార్చే (Shuffling) యోచనలో ఏఐసీసీ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పనితీరు ఆధారంగా నివేదికలు సిద్ధం చేసిన హైకమాండ్, ఈ ఏప్రిల్ నెలలోనే ఈ ప్రక్రియను కొలిక్కి తెచ్చేలా వ్యూహరచన చేస్తోంది. గాంధీభవన్ వర్గాల సమాచారం ప్రకారం, పాలనలో మరింత వేగం పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సమీకరణాల వేట: సామాజిక వర్గాలకు పెద్దపీట!
ప్రస్తుత కేబినెట్లో ఎస్టీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేకపోవడం పెద్ద చర్చకు దారితీసింది. దీంతో ఖాళీగా ఉన్న రెండు బెర్తుల భర్తీలో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఒకవేళ ఓసీ కోటాలో భర్తీ చేయాల్సి వస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. అయితే, ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గ మంత్రుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, జిల్లాల వారీగా సమతుల్యత దెబ్బతినకుండా హైకమాండ్ ఆచితూచి అడుగులు వేస్తోంది.
నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాధాన్యత!
ఇప్పటివరకు మంత్రివర్గంలో చోటు దక్కని నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలపై ఏఐసీసీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో నిజామాబాద్ కోటాలో కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక లేదా మంత్రి పదవి కేటాయింపు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. మరోవైపు రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి రేసులో ఉండగా, మున్నూరు కాపు కోటాలో ఆది శ్రీనివాస్, యాదవ సామాజిక వర్గం నుంచి బీర్ల ఐలయ్య వంటి నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
మంత్రుల పనితీరుపై నజర్.. తప్పించే ఛాన్స్ ఉందా?
ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు దాటుతున్న తరుణంలో, ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచని ఒకరిద్దరు మంత్రులను తప్పించే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారిని ఏఐసీసీలో కీలక పదవులకో లేదా కేబినెట్ ర్యాంక్ ఉన్న చైర్మన్ పదవులకో పరిమితం చేసి, కొత్త రక్తాన్ని కేబినెట్లోకి ఎక్కించాలని అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకున్న హైకమాండ్, 2029 ఎన్నికలే లక్ష్యంగా ఈ మార్పులు చేయనుంది.
అసంతృప్త నేతల ‘నయా’ గళం.. అధిష్టానానికి సవాల్!
మంత్రి పదవుల కోసం ఆశావహుల జాబితా పెద్దదిగా ఉండటంతో అధిష్టానం డైలమాలో పడింది. ముఖ్యంగా గత కొద్దిరోజులుగా విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు అసెంబ్లీలోనూ, బయటా సొంత ప్రభుత్వంపైనే ప్రశ్నలు సంధిస్తుండటం చర్చనీయాంశమైంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా మంత్రి పదవిపై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అసంతృప్తులను ఎలా చల్లారుస్తారు? స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ ప్రభావం ఎలా ఉంటుంది? అనే అంశాలపై పార్టీ ఇప్పటికే గ్రౌండ్ లెవల్ స్టడీ నిర్వహిస్తోంది.
ఢిల్లీ వేదికగా లాబీయింగ్.. ఎవరికి దక్కేనో ఆ అదృష్టం!
కేబినెట్ విస్తరణ హింట్తో ఆశావహులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఢిల్లీకి క్యూ కడుతున్నారు. అధిష్టానం పెద్దలను కలిసి తమ రాజకీయ సీనియారిటీని, సామాజిక సమీకరణాలను వివరిస్తూ లాబీయింగ్ మొదలుపెట్టారు. కార్యకర్తలు కూడా తమ నేతలకు పదవి గ్యారెంటీ అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ సెలబ్రేషన్స్కు సిద్ధమవుతున్నారు. ఏదేమైనా ఈ ఏప్రిల్ నెల తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా మారబోతోందని స్పష్టమవుతోంది.
Also Read: చెత్త వేయొద్దంటూ జనాల కాళ్లు మొక్కిన జీహెచ్ఎంసీ సూపర్వైజర్, ఇకనైనా మారండ్రా!