Telangana Cabinet: తెలంగాణ మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు కసరత్తు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మరో వారం పది రోజుల్లో కీలక మార్పులు, చేర్పులు జరగబోతున్నట్లు సమాచారం. పునర్వ్యవస్థీకరణలో నలుగురు లేదా ఐదుగురు మంత్రుల్ని తప్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డిని ఏఐసీసీలోకి తీసుకుని ఆయన స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం.
మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ పదవిపై కూడా మార్పు తప్పదన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. ఆయన స్థానంలో ప్రస్తుతం టీపీసీసీలో కీలక పాత్ర పోషిస్తున్న మహేశ్ కుమార్ గౌడ్కు అవకాశం కల్పించనున్నారని టాక్.
ఇక పీసీసీ చీఫ్ పదవిపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కొత్త నాయకత్వం అవసరమని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శ్రీదర్ బాబుకు పీసీసీ చీఫ్గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది.
పునర్వ్యవస్థీకరణలో కేవలం వ్యక్తుల మార్పులకే పరిమితం కాకుండా, శాఖల పునర్విభజన కూడా జరగవచ్చని తెలుస్తోంది. కొన్ని కీలక శాఖలను కొత్త మంత్రులకు అప్పగించడం ద్వారా ప్రభుత్వ పనితీరును మరింత దూకుడుగా మార్చాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారనే చర్చ జరుగుతోంది.
ఈ మార్పుల వెనుక రాజకీయ సమీకరణలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ మరింత పటిష్టంగా మారేందుకు ఈ పునర్వ్యవస్థీకరణ కీలకంగా మారనుందని పార్టీలోనే చర్చ సాగుతోంది.
Also Read: కానిస్టేబులే దొంగ.. రోలెక్స్ వాచ్ను ఎలా కాజేశాడంటే..!
అయితే, అధికారికంగా మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. హైకమాండ్ నుంచి తుది ఆమోదం వచ్చిన తర్వాతే మార్పులపై స్పష్టత రానుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ, ప్రస్తుతం జరుగుతున్న చర్చలు, పేర్లు, సమీకరణలు చూస్తే తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయానికి తెర లేవనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.