బీసీ కులగణన విషయంలో తెలంగాణ రాష్ట్రం యావత్ భారత దేశానికి ఆదర్శంగా నిలిచిందని, సామాజిక విప్లవానికి తెలంగాణ నాందిగా మారిందంటూ ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
“దేశ చరిత్రలో మొదటి సారి
బలహీన వర్గాల లెక్కలు తేల్చాం…
హక్కులకు చట్టబద్ధత ఇస్తున్నాం…” అంటూ ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి.
https://twitter.com/revanth_anumula/status/1901622226132344982
బీసీ రిజర్వేషన్ల పెంపు డిమాండ్ ఎప్పటినుంచో ఉందని ఆయన గుర్తు చేశారు. కులగణన చేసి వారి జనాభా ఎంత ఉందో అధికారికంగా లెక్క తేల్చామని అన్నారు. సైంటిఫిక్ మెథడ్ లో పూర్తి పారదర్శకంగా ఈ గణన చేపట్టామని అన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో బీసీ జనాభా 56.36 శాతంగా ఉందన్నారు. దీంతో తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచబోతున్నట్టు తెలిపారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకి అసెంబ్లీ ఆమోదం తెలపడంతో కీలక ముందడుగు పడినట్టయింది. అయితే దీన్ని కేంద్రం కూడా ఆమోదించాల్సి ఉంది. ఆ దిశగా చొరవ తీసుకుంటామని కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు.
https://twitter.com/revanth_anumula/status/1901609564908511288
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల పెంపుపై హామీ ఇచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 37 శాతానికి పెంచాలంటూ గవర్నర్ కి ప్రతిపాదన పంపించింది. అయితే తాజాగా బీసీ రిజర్వేషన్ల బిల్లుకి తెలంగాణ అసెంబ్లీ ఆమోద ముద్ర పడటంతో ఆ ప్రతిపాదన ఉపసంహరించుకుని, పెంపుని 42 శాతానికి చేర్చిన కొత్త బిల్లుని గవర్నర్ కి పంపిస్తోంది ప్రభుత్వం. గవర్నర్ ఆమోదం తర్వాత ఈ బిల్లుని పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ జనాభా లెక్కించి, దాని ప్రకారం రిజర్వేషన్ల పెంపు ఉంటుందని రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. దీన్ని కామారెడ్డి డిక్లరేషన్ గా తెలంగాణ కాంగ్రెస్ పేర్కొంది. అన్న మాట ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఫిబ్రవరి 4న బీసీ కుల గణన ప్రక్రియ ప్రారంభమైంది. ఇటీవల ఈ ప్రక్రియ పూర్తయింది. తెలంగాణలో బీసీల జనాభా 56.36 అని తేలింది. జనాభా ప్రకారం రిజర్వేషన్ల పెంపు కూడా అనివార్యమైంది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ తో పాటు, రాజకీయ ప్రాతినిధ్యంలో కూడా దీన్ని తప్పనిసరిగా పాటిస్తామని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీసీలకు తమ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందన్నారు.