Telangana Politics: జిల్లా కాంగ్రెస్ కమిటీ-డీసీసీ అధ్యక్షుల ఎంపిక అధికార కాంగ్రెస్ పార్టీలో కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టిందా? కొత్త నియామకాలపై కొందరు సీనియర్లు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారా? ఈ క్రమంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్లో అడుగుపెట్టారా? వారం రోజులపాటు భాగ్యనగరం లో మకాం వేయనున్నారా? గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టనున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
హైదరాబాద్కు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సోమవారం హైదరాబాద్కు చేరుకున్నారు. వారం రోజులపాటు ఆమె ఇక్కడే ఉండనున్నారు. కొత్త డీసీసీల నియామకంపై తలెత్తిన వివాదాలకు ఆమె ఫుల్స్టాప్ పెట్టనున్నారు. తాజాగా ప్రకటించిన డీసీసీల నియామకంపై పార్టీలో చిన్నపాటి గందరగోళం మొదలైంది. ఈ వ్యవహరంలో స్థానిక నేతలు-సీనియర్ నేతల మధ్య చిన్నపాటి వివాదాన్ని రాజేసింది.
ఈ విషయం మీనాక్షి చెవిలో పడగానే ఎకాఎకీన హైదరాబాద్కు పయనమయ్యారు. డీసీసీ నియామకాలపై అసంతృప్తిలో రగిలిపోతున్న నేతలతో మీనాక్షి స్వయంగా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. పాత-కొత్త డీసీసీ అధ్యక్షులతో మాట్లాడనున్నారు. వాళ్ల మధ్య విభేదాలను తగ్గించే పనిలో పడ్డారు. అదే సమయంలో కొత్తవారిని ఆమె దిశా నిర్దేశం చేయనున్నట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
వారంపాటు మకాం, కొత్త డీసీసీలతో భేటీ
అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీని అంటిపెట్టుకున్న తమకు అన్యాయం చేస్తారా? అంటూ కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వచ్చినవారికి పగ్గాలు అప్పగిస్తారా? అంటూ రుసరుసలాడుతున్నారు. ఎన్నికల సమయంలో మాకిచ్చిన హామీల సంగతి ఏంటని గోడ దూకిన నేతలు ప్రశ్నిస్తున్నారు.
కేవలం ఆదిలాబాద్ మాత్రమే కాదు, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొందని పార్టీ వర్గాల మాట. మంగళవారం పీసీసీ అధ్యక్షుడితో కొత్త డీసీసీల సమావేశం ఉండనుంది. దీనికి సీఎం రేవంత్రెడ్డి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి ముందే పార్టీలో నెలకొన్న రగడకు ఫుల్స్టాప్ పెట్టడం ఖాయమని అంటున్నారు.
ALSO READ: మెస్సితో ఫుట్బాల్ మ్యాచ్.. ముమ్మరంగా సీఎం రేవంత్రెడ్డి ప్రాక్టీసు
ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఈ గందరగోళానికి తెరదించే ప్రయత్నం చేస్తున్నారట. పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి? ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? అనేదానిపై వారికి కొత్త డీసీసీ నేతలకు ఆమె దిశా నిర్ధేశం చేయనున్నారట. మొత్తానికి డీసీసీ నియామకంలో తలెత్తిన వివాదానికి ఫుల్స్టాప్ పెట్టడం ఖాయమని అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు.