BRK Bhavan: రాష్ట్రంలో కొత్తగా పదవులు పొందిన కార్పొరేషన్ ఛైర్మన్ల కు విచిత్ర మైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న 18 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. పదవులు ఇచ్చినప్పటికీ ఆయా చైర్మన్లకు కనీస సౌలత్ లు లేక ఇబ్బందులు పడుతున్నారు. పదవులు వచ్చినందుకు సంతోషించాలో.. లేక కూర్చోవడానికి కనీసం ఒక ఆఫీసు, కుర్చీ లేనందుకు బాధపడాలో తెలియని అయోమయ స్థితిలో కొత్త ఛైర్మన్లు కొట్టుమిట్టాడుతున్నారు. పదవులు దక్కి రెండు వారాలు గడుస్తున్నా.. కార్యాలయాల కేటాయింపు జరగకపోవడంతో వీరంతా ఇప్పుడు మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.తమకు జీవోలు ఇచ్చారే తప్పా..కార్యాలయాలపై స్పష్టమైన సంకేతాలు లేవని చైర్మన్లు చెప్తున్నారు. ఇక ఆఫీసర్లను అడిగినా..పై నుంచి ఆదేశాలు రాలేదని చెప్తున్నారట. ఇది చైర్మన్లను షాక్ కు గురి చేస్తుంది.
మే 6వ తేదీన ప్రభుత్వం ఒకేసారి 11 కార్పొరేషన్లకు, ఆ తర్వాత విడతల వారీగా మరో 7 స్థానాలకు (మొత్తం 18 మందికి) ఛైర్మన్లను నియమించింది. వీరిలో గతంలోనే ఆఫీసులు ఉన్న కార్పొరేషన్లకు చెందిన ఒక ఎనిమిది మందికి పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ.. మిగిలిన 10 మంది ఛైర్మన్ల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారింది. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటైన సంస్థలకు అసలు కార్యాలయాలే లేకపోవడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. అధికారులు ఈ విషయంలో సరిగా స్పందించకపోవడంతో, కొత్త ఛైర్మన్లు తమకు ఆఫీసులు కేటాయించాలని కోరుతూ సంబంధిత మంత్రుల ఇళ్ల చుట్టూ, ఛాంబర్ల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా నియమితులైన వారిలో ఎక్కువ మంది సంక్షేమ శాఖల పరిధిలోకి వస్తుండటంతో.. వీరంతా సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లను కలిసి మొరపెట్టుకుంటున్నారు.
Also read: గుండె గట్టిగా ఉన్నవాళ్లే చూడండి: న్యూయార్క్ వరదల్లో లైవ్ వీడియో
కొత్త ఛైర్మన్లకు సెక్రటేరియట్ సమీపంలోని బీఆర్కే భవన్ , మాసబ్ట్యాంక్లోని సంక్షేమ భవన్లో కార్యాలయాలు కేటాయించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే కొత్త ఛైర్మన్లు మాత్రం తమకు బీఆర్కే భవనే కావాలని పట్టుబట్టడం గమనార్హం. ఈ బిల్డింగ్ ప్రైమ్ లొకేషన్ కావడం, సెక్రటేరియట్కు అత్యంత సమీపంలో ఉండటంతో పాటు అధికారులను, మంత్రులను సులభంగా కలిసే వీలుంటుందని వారి భావన.కానీ, బీఆర్కే భవన్లో ప్రస్తుతం కేవలం ఐదుగురికి మాత్రమే స్థలం కల్పించే అవకాశం ఉందని, మిగిలిన ఐదుగురు కచ్చితంగా మాసబ్ట్యాంక్ సంక్షేమ భవనానికే వెళ్లాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఆ ఐదుగురు అదృష్టవంతులు ఎవరా అనే చర్చ సచివాలయ వర్గాల్లో నడుస్తోంది.
ఇదిలా ఉంటే, కొత్త ఛైర్మన్ల డిమాండ్లు కేవలం కార్యాలయాలకే పరిమితం కాలేదు. ఆఫీసులను కార్పొరేట్ స్థాయిలో మరమ్మతులు చేయించాలని, ప్రత్యేక సిబ్బందిని కేటాయించాలని, గన్మెన్లను ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై భారం పెరిగిన నేపథ్యంలో.. ఈ అదనపు హంగులు, ఆర్భాటాల కోసం వస్తున్న విజ్ఞప్తులపై కొంతమంది మంత్రులు, ఉన్నతాధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.పదవుల పంపకం సజావుగానే సాగినా, మౌలిక వసతుల కల్పనలో ఎదురవుతున్న ఈ అడ్డంకులు కొత్త ఛైర్మన్లలో తీవ్ర అసంతృప్తిని రగిలిస్తున్నాయి.
Also read: ఎప్పుడూ ఫిట్గా ఉండాలా? ఈ 5 అలవాట్లను పాటిస్తే రోగాలు మీ దరిచేరవు!