Maoist Surrender: మావోయిస్టు పార్టీకి తెలంగాణలో కోలుకోలేని దెబ్బ తగిలింది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) చీఫ్, హిడ్మా అత్యంత నమ్మకస్తుడైన బర్సే దేవా (Barse Deva), తెలంగాణ రాష్ట్ర కమిటీ కీలక నేత కంకనాల రాజిరెడ్డి సహా మొత్తం 20 మంది మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ‘ఆపరేషన్ కగార్’ తర్వాత జరిగిన అతిపెద్ద ఆయుధ లొంగుబాటు ఇదేనని డీజీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుతోనే తాము లొంగిపోయామని మావోయిస్టులు తెలిపారు. లొంగిపోయిన వారందరికీ కలిపి ప్రభుత్వం తరఫున రూ. 1.80 కోట్ల రివార్డు మొత్తాన్ని అందించనున్నట్లు డీజీపీ తెలిపారు. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున అందజేశారు. మిగిలిన 17 మంది తెలంగాణ మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు.
లొంగిపోయిన వారిలో బర్సే దేవా, ఆయన భార్య, రాజిరెడ్డి, ఆయన భార్య అడ్లూరి ఈశ్వరి ఉన్నారు. వీరి వద్ద నుంచి అమెరికా తయారీ కోల్ట్ గన్, ఇజ్రాయెల్ టవర్ వెపన్, 8 ఏకే-47లు, 8 ఎస్ఎల్ఆర్లు, 4 బ్యారెల్ గ్రనేడ్ లాంచర్లు, హెలికాప్టర్ను కూల్చే 19 రౌండ్ల మందుగుండు సామగ్రి, 48 మౌంటెడ్ ఎల్ఎంజీ వెపన్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి రూ. 20 లక్షల నగదును కూడా సీజ్ చేశారు.
హిడ్మా సొంత గ్రామానికి చెందిన బర్సే దేవాపై ఎన్ఐఏ గతంలో రూ. 75 లక్షల రివార్డు ప్రకటించింది. ఒకప్పుడు 400 మందికి పైగా ఉన్న పీఎల్జీఏ బెటాలియన్ బలం ఇప్పుడు కేవలం 66 మందికి పడిపోయిందని, మావోయిస్టు పార్టీ పూర్తిగా క్షీణించిందని డీజీపీ తెలిపారు. రాజిరెడ్డి లొంగుబాటుతో.. తెలంగాణ నుంచి ఇక ఒక్కరు మాత్రమే మావోయిస్టు రాష్ట్ర కమిటీలో మిగిలారు.