Temple Land Survey: స్వేచ్ఛ బ్యూరో: దేవుడి మాన్యాల వివరాలను డిజిటల్ లో పొందుపర్చనున్నారు. అందుకు దేవాదాయశాఖ శ్రీకారం చుట్టబోతుంది. ఇప్పటికే ఓ ప్రముఖ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాదు శాఖలోని అధికారులు సంస్థకు సహకరించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు సైతం జారీ చేశారు. తొలి విడుత 40వేల ఎకరాల్లో సర్వే చేయనున్నారు. సర్వే చేసిన భూములను డిజిటల్ లో పొందుపరుస్తే ఆ భూములకు రక్షణ కలుగనుంది. భూములు ఆక్రమణకు గురికాకుండా చెక్ పడనుంది.
ఆలయ భూములను కాపాడేందుకు దేవాదాయశాఖ కసరత్తు చేస్తుంది. అత్యాధునిక సాంకేతికతతో ఆలయ భూములను సర్వే చేసేందుకు సిద్ధమైంది. ఈ సర్వే బాధ్యతలను ప్రముఖ సంస్థ అనంత టెక్నాలజీ సంస్థ కు అప్పగిస్తూ దేవాదాయశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సంస్థకు వర్క్ ఆర్డర్స్ ఇచ్చింది. సర్వే పనులకు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్లు, డిస్ట్రిక్ట్ కమిషనర్లు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పూర్తి సహకారం అందించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సర్వే బృందాలకు రికార్డులు, సరిహద్దుల వివరాలను అందించాలని సూచించారు. ఆలయ భూముల పరిరక్షణలో భాగంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టులో తొలి విడతగా 40 ఎకరాల విస్తీర్ణంలో సర్వే నిర్వహించనున్నారు. సర్వే పూర్తయిన వెంటనే ఆలయ భూముల వివరాలు, నక్షా, సరిహద్దులు ఆన్లైన్లో పొందుపర్చనున్నారు. ఈ సర్వే విజయవంతమైతే తెలంగాణలో ఆలయ భూముల రక్షణ, డిజిటలీకరణ నూతనశకం కానుంది.
రాష్ట్రంలో 87235.39 ఎకరాలు ఆలయ భూములు ఉన్నాయి. వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, కమర్షియల్ స్థలాలు ఉన్నాయి. మండలస్థాయి అధికారుల చోద్యం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడంతోనే గతంలో 20124.03 ఎకరాల ఆక్రమణకు గురయ్యాయి. ఆ భూమిని కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కోర్టు కేసులు, రాజకీయ జోక్యం, సరైన రికార్డులు లేకపోవడంతో పలు ఆలయాలకు చెందిన భూములు తరచూ అన్యాక్రాంతమయ్యాయి. వాటిని పరిరక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అందులో భాగంగానే సర్వేకు శ్రీకారం చుట్టింది. విత్ అవుట్ లిటిగేషన్ తో మరో 5569.35 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు పేర్కొంటున్నప్పటికీ అధికారికంగా మాత్రం చూపడం లేదు. అయితే ఈ భూములు సైతం సర్వేతో వెలుగులోకి రానున్నాయి.
Also Read: Vijay -Sangeetha: 28 ఏళ్ల తర్వాత బయటపడ్డ నిజం.. విడాకుల పిటిషన్ లో!
ఆలయ భూములు అన్యాక్రాంతం అవుతుండటంతో ఎండోమెంట్ శాఖ ఈ సర్వే చేపడుతుంది. ప్రతి ఆలయ భూమిని అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా జియో ట్యాగ్ చేపట్టనున్నారు. ఆక్రమణలు జరగకుండా పక్కాగా బౌండరీలను ఫిక్స్ చేస్తారు. కాగితాల రూపంలో ఉన్న పాత రికార్డులను కంప్యూటరీకరించి, ధరణి పోర్టల్ లేదా ప్రత్యేక పోర్టల్ తో అనుసంధానించనున్నారు. ఆక్రమణలో ఉన్న భూములను గుర్తించి, వాటిని లీజుకు ఇవ్వడం లేదా స్వాధీనం చేసుకోవడం ద్వారా ఆలయాలకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న భూ వివాదాలకు, ఆక్రమణలకు సైతం చెక్ పడనున్నది.
ఆలయ భూముల సర్వేను మూడు నెలల్లో పూర్తి చేయాలని శాఖ నిర్ణయించింది. సర్వే సంస్థను ఉన్నతాధికారులను ఆదేశించింది. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తొలుత సర్వే చేయబోతున్నట్లు సమాచారం. ఈ భూముల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో పొందుపర్చనున్నారు. వాటికి రక్షణ చర్యలు చేపట్టనున్నారు. ఆ తర్వాత మిగిలిన ఉమ్మడి జిల్లాల్లో సర్వే చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే మంత్రి సైతం ఆలయ భూముల రక్షణకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే దేవాదాశాఖలో ఖాళీలు ఉండటం, ఈఓల కొరత ఉండటం, పనిచేస్తున్నవారికి అదనంగా ఆలయాలను కేటాయించడంతో పర్యవేక్షణ కొరవడిందని దీంతో ఆలయ భూములు కబ్జాకు గురవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ఖాళీల భర్తీపై సైతం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.