Telangana Global Summit: అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు.. ప్రధాని మోదీతో పాటు, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కలసి ఆహ్వానించనున్నారు.
డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ సమీపంలోని భారత్ ఫ్యూచర్ సిటీలో.. ఈ గ్లోబల్ సమ్మిట్ను అత్యున్నత స్థాయిలో నిర్వహించనున్నారు. దేశ రాజకీయ రంగంలో కీలకమైన నాయకులను ఆహ్వానించడం ద్వారా ఈ సదస్సుకు మరింత ప్రతిష్ఠ కల్పించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర ప్రభుత్వ మంత్రులకు కూడా అధికారిక ఆహ్వానాలు పంపనున్నారు.
ఈ గ్లోబల్ సమ్మిట్కు పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో పాటు, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఆహ్వాన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆహ్వానాల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రత్యేకంగా ఒక వెబ్సైట్, అలాగే డ్యాష్బోర్డ్ను ప్రభుత్వం రూపొందించింది. ఈ డ్యాష్బోర్డ్ ద్వారా ఎవరికెప్పుడు ఆహ్వానం పంపారు, ఎవరు హాజరుకానున్నారు, ఎవరు స్పందించారు అన్న పూర్తి వివరాలు తక్షణమే తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే 4,500 మందికి పైగా ప్రముఖులకు అధికారిక ఆహ్వానాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. వీరిలో దేశ, విదేశాలకు చెందిన పెద్ద పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, పాలసీ నిపుణులు, విద్యా రంగ ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమ్మిట్కు దాదాపు వెయ్యి మంది ప్రతినిధులు ప్రత్యక్షంగా హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.