Telangana Government: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర పాలనలో వేగం పెంచేందుకు, ప్రజలకు ఇచ్చిన హామీలను నిర్ణీత గడువులోగా నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా మార్చి 2 నుంచి జూన్ 9 వరకు ‘100 రోజుల ప్రత్యేక కార్యాచరణ’ను ప్రకటించింది. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, క్షేత్రస్థాయిలో మార్పులు తీసుకురావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అంటూ ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రధాన హామీలు, పెండింగ్లో ఉన్న సంక్షేమ పథకాలకు ఈ 100 రోజుల్లో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అంతేగాక ప్రభుత్వ కార్యాలయాల్లో జాప్యాన్ని తగ్గించడం, పారదర్శకతను పెంచడంపై దృష్టి పెట్టనున్నారు. ఫైళ్ల కదలికలో వేగం పెంచి, సామాన్యులకు సేవలను మరింత చేరువ చేస్తారు. ప్రధానంగా విద్యా, వైద్యం, వ్యవసాయం తో పాటు మౌలిక సదుపాయాల కల్పన శాఖలకు ప్రత్యేక టార్గెట్లను ప్రభుత్వం నిర్దేశించింది. ఈ భారీ కార్యక్రమం విజయవంతం చేసేందుకు ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరూ యుద్ధప్రాతిపదికన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు, పాలనలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి ఈ సమయాన్ని ఒక ‘డెడ్ లైన్’గా సర్కార్ భావిస్తోంది. జూన్ 9 నాటికి ప్రతి శాఖలోనూ స్పష్టమైన మార్పు కనిపించాలని ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు వెళ్లాయి. సీఎం కూడా ఇటీవల ఉన్నతాధికారులకు ఆ దిశగా ఆదేశాలిచ్చారు. అయితే కేవలం పథకాల పంపిణీకే పరిమితం కాకుండా, ప్రభుత్వ శాఖల పనితీరులో శాశ్వత మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ సేవలు ఆన్లైన్ ద్వారా త్వరగా అందేలా చూడటం, ఫిర్యాదుల పరిష్కార వేదికలను బలోపేతం చేయడంతో పాటు నిరంతర రివ్యూల ద్వారా పనుల పురోగతిని చెక్ చేయడంవంటివి ఈ ప్రోగ్రామ్ లో భాగంగా అన్ని శాఖల్లో అమలు చేయనున్నారు.
Also Read: Telangana Endowments: తెలంగాణ దేవాదాయశాఖలో వింత పరిస్థితి.. 6నెలలుగా పెండింగ్లో కీలక ఫైళ్లు..!
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై 100 రోజుల కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణా రావు వెల్లడించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి తోపాటు రాష్ట్ర మంత్రులు ప్రజా ప్రతినిధులు పాల్గొనే ఈ వంద రోజుల కార్యక్రమంలో అన్ని శాఖల వారీగా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. సచివాలయంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాన్ని సీఎస్ నిర్వహించారు. అదేవిధంగా మార్చ్ 1వ తేదీ ఆదివారం జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్చి 2వ తేదీ నుండి జూన్ 9 వ తేదీ వరకు వివిధ అభివృద్ధి పనులపై ప్రతీ శాఖ తమ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని, జిల్లా కలెక్టర్ల సమావేశంలో చర్చనీయాంశాలు వెంటనే రూపొందించాలన్నారు.
ఈ సందర్బంగా వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు ప్రారంభిస్తారని, ఇందుకు గాను ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రభుత్వ భవనాలను సిద్ధం చేయాలనీ సీఎస్ అన్నారు. ప్రధానంగా గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, హెల్త్, ఎడ్యుకేషన్, పంచాయితీ రాజ్, వ్యవసాయం, రెవెన్యూ, పర్యాటక, పరిశ్రమలు, మహిళా శిశు సంక్షేమం, గృహనిర్మాణం, రెవెన్యూ, విద్యుత్, కార్మిక తదితర అన్ని శాఖలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ముఖ్యంగా, పారిశుధ్యం గ్రామీణాభివృద్ధి ఆరోగ్య తదితర కార్యక్రమాలపై నూతనంగా ఎన్నికైన సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లకు అవగాహన చైతన్య కార్యక్రమాల మాదిరిగా కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. సచివాలయం తోపాటు హెచ్.ఓ.డి లలో ఈ-ఆఫీస్ ను అమలు చేయాలని ఆదేశించారు.
Also Read: Best Family Cars 2026: టాటా To మారుతి సుజుకి.. బెస్ట్ ఫ్యామిలీ కార్లు ఇవే!