Telangana Endowments: స్వేచ్ఛ బ్యూరో: దేవాదాయశాఖలో 27 నెలల్లోనే ఒకరుకాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 8మంది అధికారులు విధులు నిర్వర్తించారు. అందరూ అదనపు బాధ్యతల్లోనే విధులు నిర్వర్తించారు. 8వ సారి శాఖ పూర్తిస్థాయి డైరెక్టర్ గా హనుమంతరావు నియామకం అయ్యారు. ఇప్పుడైనా శాఖకు చెందిన ఫైళ్లకు మోక్షం కలిగి అభివృద్ధిబాటలో ఆలయాలు పయనిస్తాయో లేదో అనేది ఆసక్తికరంగా మారింది.
దేవాదాయ శాఖకు పూర్తి స్థాయి కమిషనర్ లేదా డైరెక్టర్ను కేటాయించకపోవడంతో ఆలయాల్లో అభివృద్ధి పనులు, భక్తులకు మౌలిక వసతులు కల్పించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బదిలీలు, ప్రమోషన్లు, పోస్టింగ్ల విషయంలో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. శాఖాపరమైన కీలక ఫైల్స్ పెండింగ్లో ఉంటుండటంతో అభివృద్ది పనులు కుంటుపడుతున్నాయి. అంతేకాదు విధానపరమైన నిర్ణయాలతో పాటు టెండర్లు, కొనుగోళ్లు, కొత్త ప్రాజెక్టుల ఆమోదం, అమలులో తీవ్ర జాప్యం జరుగుతున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. ఆలయాల భూములు కబ్జాకు గురవుతున్నా.. పట్టించుకునే నాధుడే కరువయ్యారు. మరోవైపు శాఖ ఉద్యోగులే ఆలయ భూములను ఆక్రమించుకుంటున్నారనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. వారిపై చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. మరోవైపు ఉద్యోగులు, సిబ్బంది తీరుపై ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతస్థాయి అధికారుల పర్యవేక్షణ కొరవడటం తో ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. సమయపాలన పాటించకపోవడం, విధి నిర్వహణలో నిర్లక్ష్యంతో పాటు ఆలయాలకు వచ్చే భక్తుల సౌకర్యాలు కల్పించడంలోనూ అలసత్వం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
దేవాదాయ శాఖలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. ఇక్కడి కమిషనర్గా కానీ, డైరెక్టర్గానీ ఎవరొచ్చినా ఆరునెలలోపే విధులు నిర్వహిస్తుండటం గమనార్హం. వారికి శాఖపై అవగాహన పెంచుకునే సరికి బదిలీ అవుతుండటం, మరో అధికారి వచ్చినా అదే పరిస్థితి ఎదురవుతుంది. తెలంగాణకు కమిషనర్ పోస్ట్ లేకపోవడంతో వేరే శాఖలో పూర్తిస్థాయి బాధ్యతలు చేపడుతున్న ఐఏఎస్ ఆఫీసర్లకు ఎండోమెంట్లో ఇన్చార్జ్ కమిషనర్ లేదా డైరెక్టర్గా అదనపు బాధ్యతలు కొనసాగిస్తూ వస్తున్నారు. 2017లో అనిల్ కుమార్ దేవాదాయశాఖ కమిషనర్ అదనపు బాధ్యతలు తీసుకోగా 2019లో ఉద్యోగ విరమణ చేశారు. ఈ క్రమంలో నీతు ప్రసాద్ ను కమిషనర్గా నియమించారు. ఆమె ఒకరోజు వెళ్లి చార్జ్ తీసుకుని తర్వాత రాలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం అనిల్ కుమార్ పదవిని పొడిగించడంతో మళ్లీ కమిషనర్గా నియామకం అయ్యారు. ఆయన 2024 వరకు కొనసాగారు. ఈయన ఒక్కరే సుదీర్ఘ కాలం పనిచేశారు.
Also Read: Nizamabad Politics: నిజామాబాద్ జిల్లా బాన్సువాడను మై చోడీధీయ.. అంటున్న మాజీ ఎంఎల్ఏ..?
2024 ఏప్రిల్ లో హనుమంతరావు దేవాదాయశాఖ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు చేపట్టారు. 7 నెలలు పనిచేశాక యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్గా బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో హనుమంతు కొడింబాను డైరెక్టర్గా నియమించారు. అయితే, దేవాదాయశాఖ మార్గదర్శకాల్లో 45 ఏండ్లు నిండినవారే కమిషనర్ లేదా డైరెక్టర్ గా నియమించాలని ఉండటంతో నెలరోజులు కాకముందే ఆయన్ను మార్చారు. 2024 నవంబర్లో శ్రీధర్ను కమిషనర్గా నియమించగా.. కేవలం 5 నెలలే కొనసాగారు. ఆ తర్వాత 2025 ఏప్రిల్ లో వెంకటరావును నియమించారు. ఆయన ఈ గతేడాది ఏప్రిల్ 30న బాధ్యతలు చేపట్టారు. ఈయనకు అదనంగా యాదగిరిగుట్ట ఈవో బాధ్యతలు అప్పగించారు. అయితే, ఈయన పదవి కాలంకూడా పూర్తి కావడంతో ఈ పోస్ట్ ఖాళీ అయ్యింది. ఆ తర్వాత గత సెప్టెంబర్లో దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగుతున్న శైలజరామయ్యర్ కు ఇన్చార్జ్ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. జెన్కో సీఎండీగా కొనసాగుతున్న హరీశ్కు దేవాదాయశాఖ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన గతేడాది అక్టోబర్ 23న బాధ్యతలు చేపట్టారు. నాలుగు నెలలపాటు విధులు నిర్వర్తించారు. తాజాగా గురువారం రాష్ట్ర ప్రభుత్వం 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. అందులో హరీష్ ను అదనపు బాధ్యతలను తప్పించింది. యాదాద్రి భువనగిరి కలెక్టర్ గాపనిచేస్తున్న హనుమంతరావును పూర్తిస్థాయి డైరెక్టర్ గా, గోదావరి పుష్కరాలకు ప్రత్యేక అధికారిగా నియమించింది.
దేవాదాయశాఖలో ఎవరికివారే యమునాతీరే అన్న చందంగా తయారైంది.పూర్తిస్థాయి డైరెక్టర్ లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందనే ప్రచారం జరుగుతుంది. డైరెక్టర్లుగా నియామం అయినవారికి సైతం శాఖపై పూర్తి స్థాయిలో పట్టుకోలేకపోవడంతో కింది స్థాయి అధికారులు ఉద్యోగుల ప్రమోషన్లు, బదిలీలను ఇష్టానుసారంగా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎవరికి నచ్చిన వారికి సీనియార్టీతో సంబంధం లేకుండానే ఫైల్స్ కదులుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వం పూర్తిస్థాయి అధికారిగా హనుమంతరావును నియమించడం, ఆయనకు దేవాదాయశాఖపై పూర్తిగా అవగాహన ఉండటంతో శాఖకు మంచిరోజులు రానున్నాయని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Insurance Scam: నకిలీ వాహన బీమా ముఠా గుట్టురట్టు.. 9 మంది అరెస్ట్..!