Rythu Bharosa: తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రైతు భరోసా పథకం మొదటి విడత నిధులను ఈ నెల 22న విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట వేదికగా ఈ నిధుల విడుదల కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం ఈ మేరకు తుది నిర్ణయం తీసుకున్నారు.
మొదటి విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక ఎకరం లోపు భూమి ఉన్న సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ కానుంది. దీని కోసం ప్రభుత్వం రూ.3,590 కోట్ల నిధులను కేటాయించింది. రైతులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేలా మూడు విడతల్లో ఈ నిధులను పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. మొదటి విడత పూర్తయిన 20 రోజుల తర్వాత రెండో విడత కింద రూ.2,650 కోట్లను విడుదల చేయనున్నారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి మూడో విడత నిధులను కూడా విడుదల చేసి రైతు భరోసా ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
మొత్తంగా ఈ మూడు విడతల్లో కలిపి సుమారు రూ.9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. గతంలో నిలిచిపోయిన సాగు పెట్టుబడి సాయాన్ని అందించి రైతులకు అండగా నిలవడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నర్మెట్టలో జరిగే బహిరంగ సభ ద్వారా ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించి రైతుల ఖాతాల్లోకి బటన్ నొక్కి నిధులను బదిలీ చేయనున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు పెద్ద ఉపశమనం లభించనుంది.
Read Also: Telangana Budget Sessions: తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం.. బీఆర్ఎస్ వ్యూహం ఏంటి?