HYDRAA: స్వేచ్ఛ బ్యూరో: అధికారులు ‘సూపర్ కాప్స్’కారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇతరులకంటే తాము ఓ ‘ప్రత్యేక వర్గం’ అని హైడ్రా భావిస్తున్నట్టుగా అనిపిస్తోందని పేర్కొంది. హైడ్రా కూడా ప్రభుత్వ వ్యవస్థలో భాగమేనన్న విషయాన్ని మర్చిపోకూడదని స్పష్టం చేసింది. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా లోతుకుంటలోని ఓ ప్రైవేటు ఆస్తిలో ఇకపై జోక్యం చేసుకోబోమని హైడ్రా స్టాండింగ్ కౌన్సిల్ న్యాయస్థానానికి లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్పై దాఖలైన రెండు కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలను హైకోర్టు మంగళవారం క్లోజ్ చేసింది. ఈ మేరకు జస్టిస్ అనిల్ కుమార్ జుకంటి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ప్రయోజనాల కోసం పనిచేసేటపుడు అధికారులకు ఉత్సాహం ఉండొచ్చని, అయితే ఆ ఉత్సాహం చట్ట పరిమితులకు లోబడి ఉండాలని న్యాయమూర్తి హితవు పలికారు. చట్ట పరిమితులు దాటిన దుస్సాహసాలకు హైడ్రా అధికారులు ఒడిగట్టకూడదని సూచించారు.
కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ప్రైవేటు ఆస్తిలోకి ప్రవేశించడం ముమ్మాటికీ చట్టవిరుద్ధమని పేర్కొంది. ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేసింది. లోతుకుంటలోని సర్వే నంబర్లు 1, 2 లలో ఉన్న తమ భూమి విషయంలో జోక్యం చేసుకోకుండా తిరుమలగిరి తహసీల్దార్ సహా రెవెన్యూ అధికారులను ఆదేశించాలని కోరుతూ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ 2016లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
అప్పట్లో విచారణ జరిపిన కోర్టు పిటిషనర్ ఆస్తిలో జోక్యం చేసుకోవద్దని 2021లో అధికారులను ఆదేశించింది. ఆ తర్వాత కూడా అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని సదరు సంస్థ రెండు కేసులు వేసింది. దీంతో వివాదాస్పద ఆస్తిలోకి తాము ప్రవేశించబోమని జనవరి 9న అధికారులు కోర్టుకు హామీ ఇచ్చారు. అయితే, ఆ ప్రైవేటు ఆస్తిలో రాళ్లు ఉన్నాయని ‘సొసైటీ టు సేవ్ రాక్స్’ అనే సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతో ఇటీవల హైడ్రా అధికారులు సదరు స్థలంలోకి ప్రవేశించారు. దీంతో శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ తాజాగా హైడ్రా కమిషనర్పై రెండు కోర్టు ధిక్కరణ
వ్యాజ్యాలను దాఖలు చేసింది.