Raidurg Auction: హైదరాబాద్ రాయదుర్గంలోని భూముల వేలంపై హైకోర్టు మూడు వారాలపాటు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మూడు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని టీజీఐఐసీ, గౌర వెంచర్స్ కు నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్ రాయదుర్గంలోని సర్వే నెంబర్ 83/1లోని ఆరు ఎకరాలకు పైగా భూమిని టీజీఐఐసీ ఇటీవల వేలంపాట ద్వారా విక్రయించిన విషయం తెలిసిందే. ఎకరానికి 237 కోట్ల చొప్పున గౌర వెంచర్స్ బిడ్ వేసి ఈ భూములను దక్కించుకుంది. అయితే, ఈ భూమిలో అయిదు ఎకరాలు తమదేనంటూ ఎస్బీఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు ధర్మాసనం గురువారం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఎస్బీఐ 2010లోనే ఈ భూమికి సంబంధించి టీజీఐఐసీతో ఒప్పందం చేసుకున్నట్టు చెప్పారు. కుదిరిన అగ్రిమెంట్ ప్రకారం రెండేళ్లలోపు అక్కడ ఎస్బీఐ నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉందన్నారు. అయితే ఒప్పందం జరిగి పదహారేళ్లు గడిచినా ఎస్బీఐ అక్కడ ఎలాంటి నిర్మాణ పనులను ప్రారంభించలేదన్నారు.
నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలోనే ఆ భూమిని వేలానికి పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. ఈ వాదనలపై ధర్మాసనం తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీరును తప్పు పడుతూ ఏ కారణంతో ఈ భూమిని వేలం వేశారు? అని ప్రశ్నించింది. అది ఎస్బీఐకి చెందిన భూమి అని మీకు తెలియదా? అని అడిగింది. ఓ ప్రభుత్వ సంస్థ భూమిని అలా ఎలా వేలం వేస్తారని సూటిగా ప్రశ్నించింది. ఇలా భూములను వేలం వేస్తూ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పరుగులు పెట్టించాలనుకున్నారా? అంటూ వ్యాఖ్యానించింది.
Also Read: హైదరాబాద్ భూకబ్జా కేసు.. వైసీపీ నేత బొల్లా ఆన్సర్లకు.. పోలీసులకే బైండ్ బ్లాక్!
దీనిపై అదనపు అడ్వకేట్ జనరల్ తన వాదనలు వినిపిస్తూ వేలం ద్వారా వచ్చే నిధులను ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తుందని తెలిపారు. వాదనలు ముగిసిన తరువాత రాయదుర్గం భూముల వేలంపై మూడు వారాలపాటు స్టే విధిస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.