Bolla Brahma Naidu: ఏకంగా నకిలీ జీవోలు సృష్టించి హైదరాబాద్ లో రూ. వందల కోట్ల భూమిని కబ్జా చేయటానికి ప్రయత్నించి అరెస్టైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు దర్యాప్తు అధికారులకు చుక్కలు చూపించినట్టుగా తెలిసింది. ఏ ప్రశ్న అడిగినా తెలియదు.. గుర్తు లేదు అని సమాధానాలు చెప్పినట్టుగా తెలియవచ్చింది. గండిపేట గ్రామం 18/1 సర్వే నెంబర్ లో ఉన్న పది ఎకరాల భూమిని బొల్లా బ్రహ్మనాయుడు, రాధాకృష్ణలతోపాటు మరికొందరు కలిసి కబ్జా చేయటానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే.
దీని కోసం రాధాకృష్ణ ప్రభుత్వం జారీ చేసినట్టుగా నకిలీ జీవోలను సైతం సృష్టించాడు. ఈ జీవోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా గండిపేట తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి కంటపడ్డాయి. దాంతో ఆయన నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు బొల్లా బ్రహ్మనాయుడును తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. కోర్టులో హాజరు పరిచి జైలుకు రిమాండ్ చేశారు.
కాగా, కేసులో మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉన్నందున బొల్లా బ్రహ్మనాయుడును కస్టడీకి అనుమతించాలంటూ దర్యాప్తు అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు మూడు రోజులపాటు బొల్లా బ్రహ్మనాయుడును పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్ లో విచారించారు. నకిలీ జీవోల కోసం రాధాకృష్ణకు నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చిన అంశంపై ప్రశ్నించగా తనను అప్పు అడిగితే ఫైనాన్స్ చేశానని బొల్లా బ్రహ్మనాయుడు చెప్పినట్టుగా తెలిసింది.
Also Read: మూసీ ప్రక్షాళన చేస్తా.. ఫ్యూచర్ సిటీ నిర్మిస్తా.. సీఎం రేవంత్ పవర్ఫుల్ స్పీచ్!
నకిలీ జీవోల తయారీ గురించి తనకు తెలియదని అన్నట్టు సమాచారం. ఇక, కేసుకు సంబంధించి అడిగిన ప్రశ్నలు అన్నింటికీ ‘తెలియదు.. గుర్తు లేదు’ అని జవాబులు ఇచ్చినట్టుగా తెలియవచ్చింది. అలాంటప్పుడు కేసులు నమోదు కాగానే ఎందుకు పారిపోయారని ప్రశ్నించగా తాను ఎక్కడికి పారిపోలేదని అన్నట్టుగా తెలిసింది. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం టూర్ కు వెళ్లానని చెప్పినట్టుగా సమాచారం. గురువారంతో కస్టడీ గడువు ముగియటంతో బొల్లా బ్రహ్మనాయుడును కోర్టులో హాజరు పరిచిన పోలీసులు జైలుకు రిమాండ్ చేశారు.
Also Read: కూలర్ విసిగిస్తోందా? ఈ 4 పనులు చేస్తే చాలు.. రూమ్ చిల్ అయిపోద్ది!