Land Value Hike: స్వేచ్ఛ బ్యూరో: మూలుగుతున్న నక్కపై తాటికాయ పడినట్టు తయారైంది కోర్ అర్బన్ రీజియన్ లోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిస్థితి. మూడు కార్పొరేషన్ల పరిధిలో ఇప్పటికే ప్రతిపాదించి, క్షేత్ర స్థాయి పనుల దశలో ఉన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ఇకపై స్థల సేకరణ చేయాలంటే అత్యధిక ఆర్థిక భారాన్ని మోయాల్సిందే. గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతూ సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సర్కారు ప్రతిపాదించిన హెచ్ సిటీ ప్రాజెక్టు పనులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల్లో రవాణా మెరుగు, రాకపోకలు మరింత వేగంగా కదిలేందుకు వీలుగా ప్రతిపాదించిన ప్రాజెక్టులకు స్థల సేకరణ ఆశించిన స్థాయిలో జరగకపోవటం, పైగా సేకరించనున్న స్థల సేకరణకు రెండింతలు ట్రాన్స్ ఫర్ డెవలప్ మెంట్ రైట్ (టీడీఆర్) లు ఇచ్చేందుకు సర్కారు సిద్దమైనా, స్థల యజమానులు ససేమిరా అనటంతో హెచ్ సిటీ వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు ముందుకు సాగకపోవటం, భూముల ధరలను సవరించాలని తరుచూ ప్రజల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి.
వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సిఫార్సులు కూడా రావటంతో భూముల ధరలను సవరించేందుకు సర్కారు సిద్దమైంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో రేట్ల సవరణకు అనుకూలంగా నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలిసింది. భూముల మార్కెట్ విలువల్లో భారీగా హెచ్చుతగ్గులున్నట్లు గుర్తించిన సర్కారు, మొత్తం మార్కెట్ విలువలను రేష్నలైజేషన్ చేయాలని రిజిస్ట్రేషన్ శాఖను ఆదేశించిన వెంటనే చేపట్టిన కసరత్తు ముగిసినట్లు, త్వరలోనే సవరించిన మార్కెట్ ధరలు అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. దీంతో మున్ముందు మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ప్రాజెక్టుల కోసం స్థల సేకరణ చేయాలంటే ప్రస్తుతం చెల్లిస్తున్న నష్టపరిహారాన్ని మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రెండింతలు చెల్లించాల్సి వస్తుందని, దీంతో మున్సిపల్ కార్పొరేషన్లపై అత్యధిక ఆర్థిక భారం పడుతుందని అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే కార్పొరేషన్లలో కొనసాగుతున్న నిధుల లేమీ కారణంగా మోయలేని భారం పడే అవకాశమున్నట్లు సమాచారం.
Also read: సరికొత్త హంగులతో గోల్డెన్ చారియట్.. సౌత్ ఇండియన్ టూర్ కు మీరు రెడీనా?
ప్రస్తుతం పనులు జరుగుతున్న కేబీఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్లలో జీహెచ్ఎంసీ 453 ప్రాపర్టీ ల నుంచి స్థల సేకరణ ప్రక్రియను చేపట్టింది. ఇందుకు రూ. 741 కోట్ల వరకు ఖర్చవుతుంది. పార్కు చుట్టూ నిర్మిస్తున్న ఏడు స్టీల్ ఫ్లై ఓవర్లు, ఏడు అండర్ పాస్ ల నిర్మాణానికి రూ. 1090 కోట్లు వెచ్చిస్తున్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన స్థల సేకరణకు ప్రాజెక్టు వ్యయంలో సుమారు 70 శాతాన్ని వెచ్చిస్తున్నారు. పరిహారం చెల్లించేందుకు, యాజమానులు కోరితే ట్రాన్స్ ఫర్ డెవలప్ మెంట్ రైట్స్ (టీడీఆర్)లు కూడా ఇచ్చేందుకు జీహెచ్ఎంసీ సిద్దంగా ఉన్నా, స్థల సేకరణకు రకరకాలుగా అడ్డంకులేర్పడుతున్నాయి. త్వరలో పెరగనున్న భూముల మార్కెట్ వ్యాల్యుూ రేష్నలైజేషన్ తో అన్ని జిల్లాలో భూముల మార్కెట్ విలువలు రెండింతలు కానున్నట్లు తెలిసింది. అపుడు మూడు కార్పొరేషన్లలో స్థల సేకరణ కోసం ప్రస్తుతం చెల్లిస్తున్న నష్టపరిహారం కూడా బాగా పెరిగి కార్పొరేషన్లు ఆర్థిక భారాన్ని మోయాల్సిన పరిస్థితులు తలెత్తనున్నాయి.
జీహెచ్ఎంసీ పరిధిలోని కేబీఆర్ పార్కు చుట్టూ ఇంకా మరి కొన్ని ఆస్తుల నుంచి స్థల సేకరణ చేయాల్సి ఉండగా, రూ. 48.13 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రసూల్ పురా ఫ్లై ఓవర్, ఎంఎంసీ పరిధిలోని ఏఓసీ సెంటర్ నుంచి ప్రత్యామ్నాయ రోడ్ల ఏర్పాటు కు సంబంధించి రూ. 960 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలను సిద్దం చేయగా, ఇందులో 42 ఎకరాలు డిఫెన్స్ కు చెందిన భూమిని, రైల్వేకు చెందిన 2800 గజాల స్థలంతో పాటు ప్రైవేటు ఆస్తుల నుంచి మరో 1772 చదరపు గజాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు స్థల సేకరణ కోసం రూ. 498 కోట్లను కేటాయించగా, త్వరలో పెరగనున్న భూముల మార్కెట్ వ్యాల్యూ ప్రకారం ఈ వ్యయం రెండింతలు పెరగనున్నట్లు సమాచారం. దీనికి తోడు ఎంఎంసీ పరిధిలోనే టీకేఆర్ కాలేజీ నుంచి మంద మల్లమ్మ జంక్షన్ వరకు రూ. 380 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఫ్లై ఓవర్ కు కూడా స్థల సేకరణ జరిగేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దీంతో పాటు సీఎంసీ పరిధిలోని ఆల్విన్ క్రాస్ రోడ్డు నుంచి మియాపూర్ వరకు నిర్మించనున్న మరో ఫ్లై ఓవర్ తో పాటు రామంతాపూర్ నుంచి వరంగల్ వైపు వెళ్లేందుకు రూ. 656 కోట్లతో ఫ్లై ఓవర్, రూ. 368 కోట్లతో ప్రతిపాదించిన టీవీ 9 నుంచి ఎన్ఎఫ్ సీఎల్ మీదుగా వెంగళరావు పార్కు ఫ్లై ఓవర్, రూ. 150 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేసిన బంజారాహిల్స్ విరంచి హాస్పిటల నుంచి కేబీఆర్ పార్కు వరకు రోడ్డు విస్తరణకు, ఐఐటీ కూడలిలో రూ.459 కోట్లతో ఫ్లై ఓవర్, ఖాజాగూడ కూడలిలో రూ.220 కోట్లతో ఫ్లై ఓవర్, రెండు అండర్ పాస్ లు, రూ. 298 కోట్లతో రాడిసన్ జంక్షన్ ఫ్లై ఓవర్, రూ. 56 కోట్లతో జీడిమెట్ల ఫాక్స్ సాగర్ వద్ద స్టీల్ బ్రిడ్జి, రూ.309 కోట్లతో హబ్సీగూడ నుంచి నాగోల్ చౌరస్తా వరకు ఫ్లై ఓవర్, రూ. 385 కోట్లతో హాఫీజ్ బాబానగర్ నుంచి బాలాపూర్ చర్చి వరకు ఫ్లై ఓవర్, గుల్మోహర్ జంక్షన్ నుంచి లింగంపల్లి రైల్వే స్టేషన్ వరకు రూ. 308 కోట్లతో ఫ్లై ఓవర్, బండ్లగూడ నుంచి ఎర్రకుంట వరకు 109 కోట్లతో ఫ్లై ఓవర్ ప్రాజెక్టుల స్థల సేకరణ వ్యయం భారీగా పెరగటం, కార్పొరేషన్లలో నిధుల్లేకపోవటంతో స్థల సేకరణ జరుగుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also read: జోరుగా మినరల్ వాటర్ దందా.. పట్టించుకోని అధికారులు!