Mee Seva Services on WhatsApp: ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేసేందుకు రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ప్రజలకు కీలక సేవలను అందుబాటులోకి తెస్తోంది. నేటి నుంచి మీ సేవ ద్వారా పొందే అన్నిరకాల ప్రభుత్వ సేవలు.. ఇకపై వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ఈ కార్యక్రమాన్ని మంగళవారం ఐటీ మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించనున్నారు.
ఇకపై మీ-సేవ సర్వీసు వాట్సాప్ ద్వారా
రాష్ట్రవ్యాప్తంగా పౌరులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. మీ-సేవా కార్యకలాపాలను ఇకపై వాట్సాప్ ద్వారా నేరుగా ప్రజలు పొందవచ్చు. కొత్త డిజిటల్ సేవలను మంగళవారం మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించ నున్నారు. కొత్త వ్యవస్థ ద్వారా మీ-సేవా కేంద్రాలను పదేపదే సందర్శించాల్సిన అవసరం ప్రజలకు తప్పుతుంది. పౌరులు ఇకపై వాట్సాప్ వేదిక ద్వారా అన్ని ప్రభుత్వ సేవలను పొందవచ్చు.
తొలుత సర్టిఫికెట్లను వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ఆ తర్వాత మిగతా సేవలను తీసుకురానుంది ప్రభుత్వం. దీని ద్వారా ప్రజలు ఇంటి నుంచి రకరకాల బిల్లులు చెల్లించవచ్చు. ఆపై దరఖాస్తు చేసుకోవచ్చు కూడా. చెల్లించే బిల్లుల్లో విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, ఆస్తి పన్ను వంటివి ఉన్నాయి. ఆదాయ, కుల, నివాస ధృవీకరణ పత్రాలు, జనన మరణ ధృవీకరణ, మ్యారేజ్ సర్టిఫికెట్, లైసెన్సులు వంటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
వాట్సప్ ద్వారా సర్టిఫికెట్లు జారీ, తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం
మీ-సేవ ద్వారా 400 పైగానే రకరకాల సేవలను అందుబాటులోకి తేనుంది. ఆయా సేవలు క్రమంగా వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ప్రత్యేకమైన వాట్సాప్ నెంబర్ ద్వారా మెసేజ్ పంపి ఆయా సేవలు పొందవచ్చు. దరఖాస్తు స్టేటస్, అప్డేట్స్ ఇకపై వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు. కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని ఈ సేవ మరింత ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
వాట్సాప్ ద్వారా సేవలు ఎలా పొందచ్చు అనేది మీ డౌట్? అధికారిక మీ-సేవ వాట్సాప్ నెంబర్ని స్మార్ట్ ఫోన్లో సేవ్ చేయాలి. ఈ సేవలు ప్రారంభించిన తర్వాత నెంబర్ ప్రకటిస్తుంది ప్రభుత్వం. మెనూ ఆప్షన్ టైప్ చేస్తే సేవల జాబితా వస్తుంది. ఆధార్ ఆధారిత ధృవీకరణతో ఆయా సేవలను దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే డాక్యుమెంట్లు అప్లోడ్ చేయవచ్చు. దానికి సంబంధించిన ఫీజు ఆన్లైన్లో చెల్లించవచ్చు.
ALSO READ: ఆటోడ్రైవర్ సమస్యలపై కేటీఆర్ భరోసా
వాట్సాప్ సేవలతో ఏడాదికి 1.5 కోట్లకు పైగా ట్రాన్సాక్షన్లు సులభతరం అవుతాయని చెబుతున్నారు మంత్రి శ్రీధర్బాబు.ప్రభుత్వ కార్యకలాపాలను డిజిటలైజ్ చేసే విస్తృత ప్రయత్నాల్లో భాగంగా కొత్త సేవ ప్రారంభనుంది. కాగితపు పనిని గణనీయంగా తగ్గిస్తుంది. ఆ తరహా సేవలతో ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.