BRS On Mlas Defection: ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాల్లేవని ఫిరాయింపుల పిటిషన్లు కొట్టివేశారు. స్పీకర్ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తామని బీఆర్ఎస్ చెబుతోంది. స్పీకర్ తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కె.సంజయ్.. తమ వాదనలు పట్టించుకోకుండా ఏకపక్షంగా తీర్పు ఇచ్చారని ఆరోపించారు. తీర్పు కాపీని అధ్యయనం చేసి హైకోర్టుకు వెళ్తామన్నారు.
స్పీకర్ సింగిల్ లైన్ స్టేట్మెంట్తో బీఆర్ఎస్ పిటిషన్లను కొట్టివేయడం సరికాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు. సమగ్ర విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, కానీ స్పీకర్ తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తోందన్నారు. పార్టీ ఫిరాయించిన వారు బహిరంగంగా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారన్నారు. సుప్రీంకోర్టు గట్టిగా చెప్పేంత వరకు వరకు స్పీకర్ నిర్ణయం తీసుకోలేదన్నారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలన్నారు. 10 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు వస్తాయన్నారు. స్పీకర్ తీర్పుపై న్యాయపోరాటం చేసి, విజయం సాధిస్తామన్నారు.
అసెంబ్లీ సాక్షిగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ నిలువునా ఖూనీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. స్పీకర్ తీర్పుపై స్పందిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానాలపైనే కాదు.. చివరికి రాజ్యాంగంపై కూడా రాహుల్ గాంధీకి ఏమాత్రం గౌరవం లేదని మరోసారి తేలిపోయిందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి మరీ సీఎం రేవంత్ పార్టీ ఫిరాయింపులకు తెరతీసిన నాటి నుంచి నేటి స్పీకర్ నిర్ణయం వరకూ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అడుగడుగునా అపహాస్యం చేస్తూనే ఉందన్నారు.
‘అభివృద్ధి కోసం పార్టీ మారినట్టు సాక్షాత్తు ఫిరాయింపు ఎమ్మెల్యేలే అనేక సార్లు ప్రకటించినా వారిని కాపాడటం రాహుల్ గాంధీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం.కేవలం ఫొటోలకు ఫోజులిచ్చేందుకు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగితే సరిపోదు. తండ్రి చేసిన చట్టాన్నే గౌరవించలేని అసమర్థ నాయకుడిగా రాహుల్ గాంధీ చరిత్రలో మిగిలిపోతారు. రేవంత్ రెండేళ్ల పాలనా వైఫల్యాలపై పంచాయతీ ఎన్నికల్లో పల్లెపల్లెనా వెల్లువెత్తుతున్న ప్రజావ్యతిరేకతకు భయపడే కాంగ్రెస్ పార్టీ బై ఎలక్షన్స్ అంటే జంకుతోంది.ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోకుండా వెనకడుగు వేయడానికి ప్రధాన కారణం ఇదేనని తెలంగాణ సమాజానికి స్పష్టంగా అర్థమైపోయింది’ – కేటీఆర్
Also Read: TG Mlas Defection: ఆ ఎమ్మెల్యేలు సేఫ్.. అనర్హత పిటిషన్లు కొట్టివేత, స్పీకర్ కీలక నిర్ణయం
గోడ దూకిన BRS ఎమ్మెల్యేలను తాత్కాలికంగా కాపాడినట్టు కాంగ్రెస్ అనుకున్నా.. ప్రజాక్షేత్రంలో వారిని ఎమ్మెల్యే పదవికి అనర్హులుగా ఆయా నియోజకవర్గాల ప్రజలు ఎప్పుడో ప్రకటించేశారని కేటీఆర్ ఎక్స్ వేదికగా తెలిపారు.