TG Mlas Defection: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ సంచలన తీర్పు ఇచ్చారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. పార్టీ ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్యేలపై అసెంబ్లీలోని ఓపెన్ కోర్టులో స్పీకర్ తీర్పు ప్రకటించారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా మిగత 8 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ పూర్తి చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అఫిడవిట్ రూపంలో స్పీకర్ కు తమ సమాధానం తెలిపారు. ఎమ్మెల్యేల సమాధానాలపై పిటిషనర్ల అడ్వకేట్ల ముందు విచారణ సాగింది. మూడు దఫాలుగా స్పీకర్ విచారణ చేపట్టారు.
అయితే తాము పార్టీ మారలేదని ఎమ్మెల్యేలు స్పీకర్ తెలియజేశారు. కేవలం సీఎంను మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశామని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు అడిగామని తెలిపారు. ఏ పార్టీ ఎమ్మెల్యేలైన నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను కలిశామన్నారు. పార్టీ కండువా ఎక్కడ కప్పుకోలేదని స్పష్టం చేశారు. ఇంకా తమ శాలరీస్ నుండి కటింగ్ బీఆర్ఎస్ ఎల్పీకే వెళ్తున్నాయని వెల్లడించారు. దీంతో స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
పిటిషనర్లు మాత్రం ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు వచ్చిన పేపర్ కట్టింగ్స్, వీడియో క్లిప్స్ అన్ని స్పీకర్ విచారణలో తెలిపారు. బుధవారం 5 గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన స్పీకర్ తీర్పు ఇస్తూ సభ్యుల అనర్హతకు తగినన్ని ఆధారాలు లేవన్నారు. స్పీకర్ తీర్పుపై ఎమ్మెల్యేలకు ఊరట లభించింది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ పూర్తి చేసిన స్పీకర్.. నేడు తీర్పు ఇచ్చారు. ఈ నెల 18వ తేదీలోపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సుప్రీం సూచించింది. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవన్నారు.