తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేపుతున్న పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు దేశ సర్వోన్నత న్యాయస్థానం గడపకు చేరింది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్లను రేపు సుప్రీంకోర్టు విచారించనుంది. గత కొంతకాలంగా సాగుతున్న ఈ రాజకీయ న్యాయపోరాటం ఇప్పుడు కీలక దశకు చేరుకోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణలో అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ల వ్యవహారం రేపు సుప్రీంకోర్టు ముందుకు రానుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ సహా బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గతంలో ఈ ఫిటిషన్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదంటూ వారు ధర్మాసనాన్ని ఆశ్రయించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ పిటిషన్లపై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ నేతృత్వంలోని ధర్మాసనం రేపు విచారణ జరపనుంది.
మరోవైపు ఈ కేసు విచారణకు ముందే అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో ఎనిమిది మందికి ఇవ్వగా.. తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. తమపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని.. నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో అధికార పక్షం కొంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ.. సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
స్పీకర్ తీసుకున్న ఈ క్లీన్ చిట్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తుందా..? లేదా..? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం ఫిరాయింపుల నిరోధక చట్టం ఈ విషయంలో ఎలా వర్తిస్తుందో ధర్మాసనం విశ్లేషించనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేస్తుందా? లేక స్పీకర్ నిర్ణయంపై పునఃసమీక్షకు ఆదేశిస్తుందా అనే చర్చ మొదలైంది. గతంలో ఇతర రాష్ట్రాల కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు.
రాష్ట్ర రాజకీయాలను శాసించే ఈ తీర్పు కోసం ఇటు అధికార కాంగ్రెస్, అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ వేచి చూస్తున్నాయి. తమ పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలనే పట్టుదలతో బీఆర్ఎస్ ఉండగా.. స్పీకర్ నిర్ణయంతో అంతా సద్దుమణుగుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. రేపు జరిగే విచారణలో ధర్మాసనం వెల్లడించే తీర్పు తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసే అవకాశం ఉంది. మరీ సుప్రీం కోర్టు ఎలా తీర్పు ఇస్తుందో చూద్దాం..
ALSO READ: LPG Cylinder Delivery: ఇక గ్యాస్ సిలిండర్లకు ఇబ్బందేలే.. మోదీ సర్కార్ కీలక ప్రకటన