దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై నెలకొన్న ఆందోళనలకు మోదీ సర్కార్ తెరదించింది. వినియోగదారులకు ఊరటనిచ్చేలా కీలక ప్రకటన విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. గ్యాస్ బుక్ చేసిన రెండున్నర రోజుల్లోనే సిలిండర్ డెలివరీ అయ్యేలా చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. గతంలో నెలకొన్న జాప్యాన్ని నివారిస్తూ సరఫరా వ్యవస్థను వేగవంతం చేసినట్లు వెల్లడించింది.
⦿ 25 శాతం పెంచిన ఎల్పీజీ ఉత్పత్తి..
దేశీయ అవసరాలకు అనుగుణంగా LPG ఉత్పత్తిని 25 శాతం మేర పెంచినట్లు ప్రభుత్వం పేర్కొంది. పారిశ్రామిక అవసరాలతో పాటు గృహ వినియోగదారులకు ఎక్కడా అంతరాయం కలగకుండా చమురు సంస్థలు నిరంతరం పని చేస్తున్నాయి. ఉత్పత్తి సామర్థ్యం పెరగడం వల్ల నిల్వలు పెరిగాయి. దీనివల్ల బుకింగ్ చేసిన వెంటనే సిలిండర్లను పంపే వెసులుబాటు కలిగింది.
⦿ హార్ముజ్ జలసంధితో సంబంధం లేకుండా…
అంతర్జాతీయంగా హార్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్తతలు సరఫరాపై ప్రభావం చూపుతాయనే ప్రచారం సాగింది. అయితే కేంద్రం ఈ విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. హార్ముజ్ జలసంధితో సంబంధం లేని ఇతర సురక్షిత మార్గాల ద్వారా చమురు దిగుమతులను భారత్ కొనసాగిస్తోంది. ఆ మార్గం ద్వారా నిలిచిపోయిన సప్లై కంటే కూడా ఇతర మార్గాల ద్వారా ఎక్కువ మొత్తంలోనే చమురును సేకరించినట్లు ప్రభుత్వం గణాంకాలతో వివరించింది. అంతర్జాతీయ సవాళ్లు ఎదురైనా సరే దేశీయ ఇంధన భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని భరోసా ఇచ్చింది.
⦿ త్వరలోనే రెండు భారీ LNG కార్గోలు
గ్యాస్ నిల్వలను మరింత బలోపేతం చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. త్వరలోనే రెండు భారీ LNG కార్గోలు భారత తీరానికి చేరుకోనున్నాయి. ఇవి రావడం వల్ల గ్యాస్ లభ్యత ఇంకా పెరుగుతుంది. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు పెట్రోలియం శాఖ తెలిపింది. పంపిణీ నెట్వర్క్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కిందిస్థాయి డీలర్లు కూడా నిబంధనలు పాటించాలని.. వినియోగదారులకు వేగంగా సేవలు అందించాలని ఆదేశించింది.
ALSO READ: LPG Cylinder Save Tips: మీ వంట గ్యాస్ ను ఆదా కోసం సింపుల్ చిట్కాలు