Congress BJP BRS Friendship: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఊహాతీతమైన రాజకీయ సమీకరణాలు ఆవిష్కృతమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ బద్ధ శత్రుత్వాన్ని పక్కనపెట్టి, స్థానిక పీఠాలను దక్కించుకోవడానికి ఒకరికొకరు చేతులు కలపడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా నర్సాపూర్, కామారెడ్డి మున్సిపాలిటీల్లో చోటుచేసుకున్న పరిణామాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
నర్సాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉండగా, కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5, బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి. చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకీ రాకపోవడంతో, అనూహ్యంగా కాంగ్రెస్, బీజేపీ చేతులు కలిపాయి. ఈ పొత్తులో భాగంగా మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ కౌన్సిలర్ రాజు యాదవ్, వైస్ చైర్మన్గా బీజేపీ కౌన్సిలర్ బుచ్చెష్ యాదవ్ ఎన్నికయ్యారు. సిద్ధాంతపరంగా వ్యతిరేక పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఇక్కడ అధికారం కోసం ఒకటి కావడం విశేషం.
అటు కామారెడ్డి మున్సిపల్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠకు కూడా అనూహ్య రీతిలో తెరపడింది. ఇక్కడ బీజేపీని అధికారానికి దూరం పెట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. కామారెడ్డిలో మ్యాజిక్ ఫిగర్ 25 కాగా, కాంగ్రెస్ వద్ద స్వతంత్రులతో కలిపి 22 మంది సభ్యులు ఉన్నారు. చివరి క్షణంలో బీఆర్ఎస్కు చెందిన 11 మంది కౌన్సిలర్లు మద్దతు తెలపడంతో కాంగ్రెస్ బలం 33కు చేరింది. దీంతో చైర్మన్గా కాంగ్రెస్ అభ్యర్థి (స్వతంత్రురాలిగా గెలిచి పార్టీలో చేరిన) ఇప్ప ఉమారాణి, వైస్ చైర్మన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ కాసర్ల గోదావరి ఎన్నికయ్యారు.
ఈ వింత పొత్తులు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీశాయి. స్థానిక అవసరాలు, ప్రత్యర్థి పార్టీలను నిలువరించడానికి పార్టీలు తమ జెండాలను పక్కనపెట్టి ‘దోస్తీ’ కట్టడం గమనార్హం. ఇద్దరు మహిళా నేతలు పీఠం దక్కించుకున్న కామారెడ్డిలో, కాంగ్రెస్-బీజేపీ కలిసిన నర్సాపూర్లో రాబోయే రోజుల్లో పాలన ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
Read Also: Telangana Municipal Chairman Winners: తెలంగాణ మున్సిపల్ పీఠాలపై నూతన సారథులు..!