Telangana Panchayat Elections: పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, ఊరూరా కోలాహలం నెలకొంది. ఈ క్రమంలో ప్రజాస్వామ్య నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకునేందుకు.. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (TSSEC) కీలక ప్రకటనను విడుదల చేసింది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతలుగా జరగనున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. ఎన్నికల ప్రచారంపై కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
ప్రతి విడత పోలింగ్కు ముందు రోజు ప్రచారం పూర్తిగా నిలిచిపోవాలి. అందుకు అనుగుణంగా ప్రచారం ముగిసే తేదీలను ఇలా నిర్ణయించారు:
డిసెంబర్ 11వ తేదీ పోలింగ్కు డిసెంబర్ 9 సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగింపు
డిసెంబర్ 14వ తేదీ పోలింగ్కు డిసెంబర్ 12 సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగింపు
డిసెంబర్ 17వ తేదీ పోలింగ్కు డిసెంబర్ 15 సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగింపు
ఈ సమయం తర్వాత ఏ అభ్యర్థి, పార్టీ ఎటువంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించినా ఎన్నికల నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుందని ఈసీ స్పష్టం చేసింది.
గడువు తర్వాత ప్రచారం చేయడం అభ్యర్థి పోలింగ్ ప్రక్రియపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని, అందుకే ఈ చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలని ఎన్నికల సంఘం పేర్కొంది.
అధికారులు ఈ నిబంధనల అమలుపై ఖచ్చితంగా పర్యవేక్షణ చేస్తారని, ఉల్లంఘన జరిగినట్లయితే సంబంధిత అభ్యర్థిపై తీవ్ర చర్యలు తీసుకోవాలని సూచనలు జారీ చేశాయి. గ్రామాలలో పోలింగ్కు ముందు భారీగా పోలీసులు మోహరించి శాంతిభద్రతలు కట్టుదిట్టం చేయనున్నారు.
పంచాయతీ ఎన్నికలు సమీపించడంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు ఎన్నికల కోలాహలంతో నిండిపోయాయి. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల పోటీలు అనేక చోట్ల హోరాహోరీగా సాగుతున్నాయి. ఎన్నికల ప్రచారం చివరి దశలో ఉండటంతో అభ్యర్థులు ఒక్క ఇంటినీ వదలకుండా ప్రచారం చేస్తున్నారు.
ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తమ అభివృద్ధి ప్రణాళికలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు తమ గత పనులను చూపుతూ మళ్లీ అవకాశం ఇవ్వాలంటూ కోరుతుంటే, కొత్త అభ్యర్థులు గ్రామంలో కొత్త మార్పుల కోసం తమ విజన్ను వివరిస్తున్నారు.
Also Read: ఎస్ఐఆర్ కంటిన్యూ చేయాల్సిందే.. రాష్ట్రాలకు క్లారిటీ ఇచ్చిన సుప్రీంకోర్టు
తెలంగాణలోని 4, 236 గ్రామాల్లో రేపు సర్పంచ్, వార్డు మెంబర్ల కోసం ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా గ్రామాల్లో ఇప్పటికే ఈసీ పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది.