Telangana Phone tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. ఆయనతోపాటు హరీష్రావు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు తప్పవని ఈ ఉదయం వివిధ ఛానెళ్లు కథనాలు ప్రచారం చేశాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోంది. సీపీ సజ్జనార్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే మాజీ ఐఏఎస్, ఐపీఎస్లను విచారించింది. ఇంకా చాలామందిని విచారిస్తోంది. పలువురు అధికారులకు నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వం పెద్దలు చెప్పినట్టు తాము చేశామని అధికారులు తెలిపారట.
ఈ క్రమంలో రాజకీయ నేతలవైపు ఫోకస్ చేసింది సిట్. ఆనాడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ప్రభుత్వ పెద్దలకు నోటీసులు ఇవ్వాలని భావిస్తోంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తోపాటు ఇద్దరు మాజీ మంత్రులకు నోటీసులు ఇవ్వనుంది సిట్. వారిలో ఒకరు హరీష్రావు ఉన్నట్లు సమాచారం.
కేసీఆర్కు చిక్కులు, నోటీసు ఇవ్వనున్న సిట్?
అసెంబ్లీ సమావేశాల తర్వాత నోటీసులు ఇవ్వడం ఖాయమన్నది దాని సారాంశం. అదే జరిగితే కేసీఆర్ వ్యక్తిగతంగా విచారణకు హాజరై, వివరణ ఇవ్వాల్సి పరిస్థితి నెలకొంది. అప్పటి ప్రభుత్వ పెద్దల కోసం ట్యాపింగ్ చేసినట్టు విచారణలో ప్రభాకర్రావు వెల్లడించారు.
ఈ క్రమంలో మాజీ సీఎస్లు, మాజీ డీజీపీలు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్లను పిలిచి విచారణ చేపట్టింది సిట్. అధికారులను స్టేట్మెంట్లను రికార్డు చేసింది. నిబంధలకు విరుద్ధంగా ప్రభాకరరావు, రివ్యూ కమిటీ అనుమతి లేకుండా కొన్ని ఫోన్లను ఆయన ట్యాపింగ్ చేసినట్టు కథనాలు వస్తున్నాయి.
ALSO READ: జగన్ దారిలో మాజీ సీఎం కేసీఆర్, ఇప్పుడు అదే పద్దతి
ఆయా నెంబర్లను పైస్థాయి అధికారుల ఆదేశాల మేరకు చేసినట్టు ఆయన స్టేట్మెంట్ రూపంలో తెలిపారట. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్తోపాటు ఇద్దరు మాజీ మంత్రులను విచారిస్తే ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశముందని భావిస్తోంది. ఆ తర్వాత అడిషనల్ ఛార్జిషీటు దాఖలు చేయాలన్నది సిట్ ఆలోచనగా తెలుస్తోంది.
ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్గాలు స్పందించాయి. కొన్ని మీడియా ఛానెళ్లు చేసిన ప్రచారాన్ని ఖండించాయి. తప్పుడు ప్రచారంగా వర్ణించాయి. అయితే వాస్తవాలేంటి అనేది తెలియాల్సి వుంది. కొద్దిరోజుల కిందట మీడియాతో చిట్ చాట్ చేసిన సీఎం రేవంత్రెడ్డి.. జగన్ చేసిన తప్పుడు పనిని తాను చేయనని ఒకానొక సందర్భంలో చెప్పిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు.