మార్చి ప్రారంభంలోనే భానుడు భగభగలాడుతున్నాడు. ఉదయం ఎనిమిది, తొమ్మిది గంటలకే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. వేసవి తాపం ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఇంకెంత తీవ్రంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్న తరుణంలో తెలంగాణ వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు అందించింది. రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి త్వరలోనే విముక్తి లభించనుంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ఎండల తీవ్రత తగ్గి పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మార్చి 14 వరకు ఎండలు ఇలాగే కొనసాగుతాయి. మార్చి 15 నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ప్రారంభమవుతాయి. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో కూడిన జల్లులు పడవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం వంటి ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
వచ్చే రెండు మూడు రోజులు ఎండ తీవ్రత గరిష్ఠ స్థాయిలో ఉంటుంది. మార్చి 15 నుంచి ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో అతి తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మార్చి 16, 17 తేదీల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్ల వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ గాలులతో కూడిన ఈ అకాల వర్షాల వల్ల ఎండల నుంచి తాత్కాలికంగా ఉపశమనం లభించినప్పటికీ ఆస్తి నష్టం సంభవించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
పంట కోత దశలో ఉన్న రైతులు తమ ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలి. ఆరబోసిన ధాన్యంపై టార్పాలిన్ పట్టాలు కప్పి ఉంచాలి. పండ్ల తోటల రైతులు గాలి వానల వల్ల జరిగే నష్టాన్ని నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద నిలబడకూడదని విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. పశువులను మేతకు తీసుకెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలి.
వాతావరణంలో సంభవిస్తున్న ఈ ఆకస్మిక మార్పుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పడతాయని నిపుణులు భావిస్తున్నారు. తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం లభిస్తుందని జనం సంతోషిస్తున్నా ఈ అకాల వర్షాలు తెచ్చే విపత్తుల పట్ల భయం కూడా వెన్నాడుతోంది. రాబోయే నాలుగు రోజులు వాతావరణ శాఖ జారీ చేసే వార్తలను గమనిస్తూ ప్రజలు తగిన జాగ్రత్తలతో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ALSO READ: Black Neck: మెడ నలుపును సులువుగా వీటితో తొలగించుకోవచ్చు, ఖర్చేమీ కాదు