TG Rajyasabha Elections: తెలంగాణ రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఇద్దరు అభ్యర్థులను తెలంగాణ కాంగ్రెస్ ఖరారు చేసింది. ఒక సీటుకు కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ పేరు కాగా, రెండో అభ్యర్థిగా డాక్టర్ పుంజాల వినయ్కుమార్ ఎంపిక చేసినట్టు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.
రాజ్యసభ ఎన్నికలు.. ఢిల్లీకి సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణలో అధికార పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఎవరన్న దానిపై బుధవారం ఓ క్లారిటీ రానుంది. పార్టీ హైకమాండ్ అభ్యర్థులపై ఇవాళ ప్రకటన చేయనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్లకు పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ సూచన చేశారు. దీంతో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్లనున్నారు.
పార్టీ సీనియర్ నేత అభిషేక్ మనుసింఘ్వీకి మరోసారి ఛాన్స్ ఇవ్వాలని ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఒకటి సీటుకు అభిషేక్ అయితే.. మరొక సీటు ఎవరికి ఇవ్వాలనే దానిపై తేలనుంది. తాజాగా తెరపైకి డాక్టర్ పుంజాల వినయ్ కుమార్ పేరు వెలుగులోకి వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా అభిషేక్, డాక్టర్ వినయ్!
రెండు రాజ్యసభ సీట్లకు తెలంగాణ కాంగ్రెస్ నుంచి దాదాపు డజను మంది వరకు పోటీ పడుతున్నారు. ఈ సీట్ల కోసం ఆయా నేతలకు తమకున్న పరిచయాలతో ఢిల్లీ స్థాయిలో పైరవీలు మొదలుపెట్టారు. తమకే సీటు వస్తుందని సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. రెండు సీట్లలో ఒకటి పార్టీ హైకమాండ్ ఒకర్ని ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. మరొక సీటుని తెలంగాణకు విడిచిపెట్టినట్టు ప్రచారం లేకపోలేదు.
ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లను పార్టీ హైకమాండ్ అధికారికంగా ప్రకటించనుంది. బుధవారం కాకుంటే గురువారం ఎంపిక చేసిన అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తారని చెబుతున్నారు. సామాజిక సమీకరణాలు, పార్టీ పట్ల విధేయత, రాజకీయ కారణాల నేపథ్యంలో డాక్టర్ వినయ్ కుమార్కు హైకమాండ్ అవకాశం కల్పించినట్లు కొందరు నేతలు చెబుతున్నారు.
ALSO READ: హైదరాబాద్ భారీ అగ్నిప్రమాదం.. బాచుపల్లిలో దగ్ధమైన ఫర్నిచర్ షాపు
డాక్టర్ పుంజాల వినయ్ కుమార్ వెలుగులోకి వచ్చింది. ఆయన ఎవరోకాదు కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ కొడుకు. శివశంకర్ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుందని, దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తోందని చెబుతున్నారు నేతలు. అందుకే ఈసారి వినయ్కు అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు.
చివరి నిమిషంలో ఏమైనా మార్పులు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. మరి అధిష్టానం మదిలో ఏముందో చూడాలి. రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు మార్చి 5 గురువారం వరకు ఉంది. మార్చి 6న నామినేషన్ పరిశీలన కాగా, 9 వరకు విత్ డ్రాకు అవకాశం ఉంది. వేరే పార్టీ అభ్యర్థి బరిలో ఉంటే ఎన్నిక మార్చి 16న జరగనుంది.