Telangana Schools: తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకూ తరగతులు జరపాలని ఆదేశించారు. తరగతులు ముగిసిన అనంతరం మ. 12.30 తర్వాత సంబంధిత పాఠశాలలో యథావిధిగా మధ్యాహ్న భోజనం అందజేయనున్నట్లు స్పష్టం చేసారు.
మరోవైపు పదో తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలలో మ. 1:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకూ ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలియజేసింది. అటు పదో తరగతి పరీక్షలు ముగిసేవరకూ టెన్త్ విద్యార్థులకు స్పెషల్ క్లాసులు కొనసాగుతాయని వెల్లడించింది.
మరోవైపు వేసవి సెలవులను సైతం తెలంగాణ విద్యాశాఖ ఖరారు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకూ సమ్మర్ హాలీడేస్ గా వెల్లడించింది. తిరిగి జూన్ 12న స్కూళ్లు తెరుచుకుంటాయని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను తమ ఆదేశాలని తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. లేని పక్షంలో ఆయా స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
రాబోయే రంజాన్ పండుగ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉర్దూ స్కూళ్లతో పాటు పాటు డైట్ (DIET) కళాశాలలకు ప్రత్యేక పని వేళలను కల్పించింది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంట వరకూ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో మిస్ అయిన సిలబస్ ను కవర్ చేసేందుకు మార్చి 20 నుంచి అదనపు తరగతులు ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Also Read: Air Cooler vs Air Conditioner: సమ్మర్లో ఏసీ కొనాలా? కూలర్ కొనాలా? మీకు ఏది సరైనది!