Hanumakonda Collector: కమలాపూర్ బ్యూరో, స్వేచ్ఛ: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకునేలా ఉపాధ్యాయులు సృజనాత్మకంగా, ఇన్నోవేటివ్ పద్ధతుల్లో బోధించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గూడూరుతో పాటు ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్, విద్యార్థుల హాజరు వివరాలు తెలుసుకొని, ముఖ గుర్తింపు విధానంలో హాజరు నమోదు ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఆరు, పదో తరగతుల గదులను సందర్శించి విద్యార్థులతో నేరుగా మాట్లాడి బోధన విధానంపై అభిప్రాయాలు అడిగారు.
Also Read: IBomma Ravi: ఐ బొమ్మ రవికి భారీ ఊరట… షరతులతో కూడిన బెయిల్ మంజూరు..
లెట్స్ ఎన్రిచ్ ఇంగ్లీష్ పాఠ్యాంశ బోధనను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థుల ఆంగ్ల ప్రావీణ్యంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు. ఉపాధ్యాయులు బోధిస్తున్న పాఠ్యాంశాలు విద్యార్థులకు స్పష్టంగా అర్థమవుతున్నాయా అనే విషయాన్ని తెలుసుకున్నారు. ప్రాథమిక పాఠశాలలో అన్ని తరగతులను పరిశీలించిన కలెక్టర్, ఐదో తరగతి విద్యార్థులతో ఆంగ్లంలో మాట్లాడించి వారి పఠన నైపుణ్యాలను పరీక్షించారు. పాఠశాల ప్రాంగణ పరిశుభ్రత, తాగునీటి సదుపాయాలు, వంటగది, మరుగుదొడ్ల నిర్మాణ స్థితిని పరిశీలించారు. అసంపూర్తిగా, నిరుపయోగంగా ఉన్న నిర్మాణాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వాటి వివరాలతో రెండు రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని డీఈవోను ఆదేశించారు.
క్లాస్రూమ్లు అందుబాటులో ఉన్నప్పటికీ విద్యార్థులను బయట కూర్చోబెట్టడం సరికాదని హెచ్చరించారు. పాఠశాల వాతావరణం పరిశుభ్రంగా, సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజన నాణ్యతపై కూడా కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు ఆంగ్ల భాషలో పట్టు సాధించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదాల సరైన ఉచ్చారణ, అర్థ వివరణతో పాటు ఆంగ్ల పదాలను తెలుగులో సరిగ్గా అనువదించి బోధించాలని తెలిపారు. విద్యార్థులు చదివింది అర్థం చేసుకోవడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో ఎల్.వి.గిరి రాజ్ గౌడ్, తహసిల్దార్ సురేష్ కుమార్, ఎంపీడీవో గుండె బాబు, ఎంఈఓ శ్రీధర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.