Sports Authority: స్వేచ్ఛ బ్యూరో: పదవీకాలం ముగిసింది..అధికారికంగా బాధ్యతలు లేవు.. అయినా స్పోర్ట్స్ అథారిటీలో మాత్రం ఆయన హవా కొనసాగుతోంది. కీలక నిర్ణయాలు, అధికార కార్యక్రమాలు, పర్యటనల్లోనూ మాజీ చైర్మన్ కనిపిస్తుండటంతో అథారిటీ వర్గాల్లో చర్చ మొదలైంది. పదవిలో లేని వ్యక్తి అధికారిక కార్యక్రమాల్లో ఎలా భాగస్వామి అవుతున్నారు? ఢిల్లీకి వెళ్లిన స్పోర్ట్స్ బృందంతో కలిసి ఆయన పర్యటించాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయనకు అంత ప్రియారిటీ ఎందుకు ఇస్తున్నారనేది కూడా ఆసక్తి కరంగా మారింది.
స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఆయన పదవీకాలం ఈ ఏడాది జూలై 13న ముగిసినప్పటికీ.. అథారిటీ వ్యవహారాల్లో ఆయన జోక్యం కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా పదవీకాలం ముగిసిన తర్వాత మాజీ చైర్మన్లు అధికారిక నిర్ణయ ప్రక్రియకు దూరంగా ఉండాలి. అంతేకాదు కార్యాలయాలకు ఏదైనా పనిమీద వచ్చినా చైర్మన్ స్థానంలో కూర్చోవద్దు. కానీఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అథారిటీ కార్యాలయానికి ఆయన తరచూ వస్తుండటం, అధికారులతో భేటీ కావడం, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం, చైర్మన్ చైర్ లో కూర్చోవడంఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన రాక సందర్భంగా అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపైనా అంతర్గతంగా చర్చజరుగుతుంది. ఆయన చెప్పిందే అధికారులు కూడా చేస్తుండటం గమనార్హం.
ఇటీవల నిర్వహించిన పలు అధికారిక కార్యక్రమాల్లోనూ మాజీ చైర్మన్ పాల్గొన్నట్లు మీడియాకు విడుదల చేసిన ఫొటోలే నిదర్శనం.పదవిలో లేని వ్యక్తికి అధికారిక కార్యక్రమాల్లో ఎలాంటి హోదాలో అవకాశం కల్పిస్తున్నారన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ నెల 8న ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ వైస్ ఛైర్పర్సన్, ఎండీ ఎ. సోనిబాలా దేవి ఆధ్వర్యంలో హైదరాబాద్ పరిధిలోని స్టేడియాల నిర్వాహకులు, కోచ్లు, డిప్యూటీ డైరెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఏకంగా చైర్మన్ స్థానంలో కోర్చోవడం హాట్ టాఫిక్ అయింది. అంతేకాదుఅథారిటీకి సంబంధించిన కీలక పర్యటనల్లో ఆయన భాగస్వామ్యం కావడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీకి వెళ్లిన స్పోర్ట్స్ బృందంతో ఆయన కూడా వెళ్లారు. ప్రభుత్వ/అథారిటీ బృందంలో ఆయన ఏ హోదాలో ఉన్నారు? ప్రయాణానికి అధికారిక అనుమతి ఉందా? ఖర్చులు ఎవరు భరించారు? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
Also read: నెల్లూరులో చెత్త నిధులపై మాటల యుద్ధం.. సవాల్ విసిరిన వైసీపీ.. తిప్పికొట్టిన కూటమి!
మాజీ చైర్మన్ ఇప్పటికీ తనను తాను ‘చైర్మన్’గా పేర్కొంటూ ప్రెస్నోట్లు విడుదల చేస్తున్నారన్నారు.ఆయన అధికారికంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎండీ ఉన్నప్పటికీ నామమాత్రంగానే మారారనే విమర్శలు వస్తున్నాయి.పదవీకాలం ముగిసిన తర్వాత కూడా అదే హోదాను ఉపయోగించడానికి అధికారికంగా ఏదైనా అనుమతి ఉందా? లేక అథారిటీ నుంచి ఎవరైనా ఆయనకు అలాంటి గుర్తింపు ఇస్తున్నారా? అన్నది చర్చకు దారితీసింది.ప్రభుత్వ సంస్థలో పదవులు, హోదాలు అధికారిక ఉత్తర్వులతోనే నిర్ణయించబడతాయి. అలాంటప్పుడు పదవీకాలం ముగిసిన వ్యక్తి తనను తాను అదే హోదాలో పరిచయం చేసుకోవడం, అధికారిక కార్యక్రమాల్లో అదే గుర్తింపుతో కనిపించడం వెనుక కారణమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇదిలా ఉండగా.. త్వరలో మళ్లీ తనకే చైర్మన్ పదవి దక్కుతుందంటూ ఆయన ఉద్యోగులకు సంకేతాలు ఇస్తున్నారన్న ప్రచారం అథారిటీ వర్గాల్లో సాగుతోంది. తన పదవి పునరుద్ధరణ ఖాయమన్న భావనను కొందరి వద్ద వ్యక్తం చేస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది.అయితే దీనికి అధికారిక ధ్రువీకరణ ఉందా? ప్రభుత్వం ఆయనను తిరిగి నియమించాలనే నిర్ణయం తీసుకుందా? లేక ఇవన్నీ ఆయన అనుచరుల్లో, ఉద్యోగుల్లో సాగుతున్న ప్రచారమేనా? అన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది.
పదవిలో లేని మాజీ చైర్మన్ తరచూ కార్యాలయానికి రావడం, అధికార కార్యక్రమాల్లో కనిపించడం, ఉద్యోగులతో నేరుగా మాట్లాడటం, స్టేడియంకు వచ్చిక్రీడాకారులను సైతం సన్మానిస్తుండటంవంటి పరిణామాలు కొందరు సిబ్బందిలో అసౌకర్యానికి కారణమవుతున్నట్లు సమాచారం. అధికారికంగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రస్తుత యంత్రాంగం ఉండగా.. మాజీ చైర్మన్ ప్రభావంకొనసాగితే నిర్ణయాధికారం ఎవరిదన్న సందేహం ఉద్యోగుల్లో తలెత్తుతోంది.‘అధికారికంగా పదవిలో లేని వ్యక్తి మాటకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి?’ అన్నది ఉద్యోగుల్లో అంతర్గతంగా చర్చకుదారితీసింది.
మాజీ చైర్మన్ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి అనుమతి ఎవరు ఇచ్చారు? ఢిల్లీ పర్యటనలో ఆయన హోదా ఏమిటి? పర్యటన ఖర్చులు ఎవరు భరించారు? ఇప్పటికీ ‘చైర్మన్’గా ప్రెస్నోట్లు ఎలా విడుదలవుతున్నాయి? మళ్లీ నియామకంపై ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుందా? వంటి ప్రశ్నలకు స్పోర్ట్స్ అథారిటీ, సంబంధిత శాఖ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఆయన కేవలం మాజీ చైర్మనా? లేక ఇప్పటికీ అథారిటీలో ఏదైనా అధికారిక బాధ్యత నిర్వహిస్తున్నారా? అన్నది అథారిటీ క్లారిటీఇస్తుందా?లేదా?అనేది చూడాలి.
Also Read: దళితుల ఓట్ల కోసమే BRS వాడకం.. శ్వేతపత్రం విడుదల చేయాల్సిందే: పీసీసీ చీఫ్