Liquor Consumption: దక్షిణాదిలో మద్యం వినియోగంలో తెలంగాణ టాప్ లో నిలిచినట్లు ఎక్సైజ్ అంచనాల్లో తేలింది. రాష్ట్రాల వారీగా ఒక ఏడాదిలో అమ్ముడైన మొత్తం మద్యం పరిమాణాన్ని, ఆయా రాష్ట్రాల జనాభాతో భాగించి తలసరి మద్యం వినియోగాన్ని లెక్కించగా.. తెలంగాణ మొదటి స్థానంలో నిలిచినట్లు తేలింది.
సగటున తెలంగాణలో ఏడాదికి 4.44 లీటర్ల ఆల్కహాల్ వినియోగిస్తున్నట్లు అంచనాలు వెల్లడించాయి. ఈ జాబితాలో రెండో స్థానంలో కర్ణాటక ఉంది. అక్కడ తలసరి వినియోగం 4.25 లీటర్లు. ఆ తర్వాత తమిళనాడు 3.38 లీటర్లు, ఆంధ్రప్రదేశ్ 2.71 లీటర్లు, కేరళ 2.53 లీటర్లు వినియోగంతో వరుసగా నిలిచాయి.
మద్యం వినియోగం మాత్రమే కాకుండా, ఖర్చు విషయంలోనూ తెలంగాణ ముందంజలోనే ఉంది. తెలంగాణలో మద్యం కోసం సగటున ఏడాదికి రూ.11,351 వెచ్చిస్తున్నట్లు ఎక్సైజ్ అంచనాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ ఖర్చు రూ.6,399గా నమోదైంది.
తెలంగాణలో మద్యం విక్రయాల పెరుగుదలకు.. పలు అంశాలు కారణమవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ వంటి మెట్రో నగరంతో పాటు జిల్లా కేంద్రాలు, మండల స్థాయిలో కూడా మద్యం దుకాణాల విస్తృతి ఎక్కువగా ఉండటం వినియోగాన్ని ప్రభావితం చేస్తోంది.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం విక్రయాల ద్వారా భారీ ఆదాయం లభిస్తోంది. ఎక్సైజ్ శాఖకు వచ్చే ఆదాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఈ ఆదాయం ఉపయోగపడుతుండటంతో ప్రభుత్వాలు మద్యం విధానాలపై సమతుల్య నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆదాయంతో పాటు సామాజిక ప్రభావాలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సామాజిక నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: మాట మీద నిలబడుతా.. గ్రామ అభివృద్ధే నా లక్ష్యం, యువ సర్పంచ్ ప్రమాణ స్వీకారం
అతిగా మద్యం సేవించడం వల్ల ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయన్న ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ.. మద్యం ఖర్చు ఎక్కువగా ఉండటం కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి.