కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామ నూతన సర్పంచ్గా ఎన్నికైన మాదారి శ్రీనివాస్ నేడు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిన నేపథ్యంలో మాదాపూర్ గ్రామ ప్రజలు మాదారి శ్రీనివాస్పై నమ్మకం ఉంచి భారీ మెజారిటీతో గెలిపించారు. ఈ క్రమంలోనే సోమవారం నాడు ఆయనతో పాటు ఎనిమిది మంది వార్డు సభ్యులు కూడా తమ బాధ్యతలను స్వీకరిస్తూ ప్రమాణం చేశారు.
ప్రమాణ స్వీకారం అనంతరం సర్పంచ్ మాదారి శ్రీనివాస్ నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని స్పష్టం చేశారు. ముఖ్యంగా తన మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించి, మాదాపూర్ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు
సర్పంచ్ మాదారి శ్రీనివాస్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకటించిన 14 ప్రధాన వాగ్దానాలు ఇప్పుడు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
పన్నుల భారం నుంచి విముక్తి: తాను గెలిచిన నాటి నుండి ఐదేళ్ల పాటు గ్రామ ప్రజలందరికీ ఇంటి పన్ను మరియు నల్లా పన్నును తానే స్వయంగా చెల్లించి, ప్రతి ఇంటికీ రశీదు పంపిస్తానని మాదారి శ్రీనివాస్ ప్రకటించారు.
నీటి సౌకర్యం & పారిశుధ్యం: గ్రామంలో ఉన్న వాటర్ ప్లాంట్లను ఎప్పటికప్పుడు రిపేర్ చేయడంతో పాటు, నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండేలా తగిన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.
ఆడపిల్లలకు ఆర్థిక భరోసా: గ్రామంలో జన్మించిన ప్రతి ఆడపిల్లకు 21 రోజుల లోపు 5,116 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు.
విద్య & వైద్యం: ప్రభుత్వ పాఠశాలల భవనాల మరమ్మతులు చేపట్టడంతో పాటు, విద్యార్థులకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. అలాగే నిరుపేద కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబానికి 50 కిలోల బియ్యం సాయం చేస్తామని తెలిపారు.
మహిళా సాధికారత: మహిళా సంఘాల ఆధ్వర్యంలో కుటీర పరిశ్రమలు, ముఖ్యంగా పచ్చళ్ల తయారీ వంటి ఉపాధి మార్గాలను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.
అభివృద్ధి & సంస్కృతి: ఏడాదిలోపు నూతన పాలక వర్గం ఆధ్వర్యంలో డా. బి.ఆర్. అంబేద్కర్, ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే సీతారామాంజనేయ స్వామి, హనుమాన్, పోచమ్మ, ఎల్లమ్మ దేవాలయాల అభివృద్ధికి మరియు వీధి దీపాల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు.
యువతకు ఉపాధి: గ్రామంలోని యువత కోసం ఆధునిక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, పోటీ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
రైతు సంక్షేమం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ ద్వారా అర్హులైన రైతులందరికీ డ్రిప్ మరియు స్ప్రింక్లర్లను అందజేస్తామని, అలాగే వరి ధాన్యం కొనుగోలు కేంద్రం కోసం భూమిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
భద్రత & పర్యావరణం: ప్రధాన కూడళ్లు, పాఠశాలలు, ప్రార్థనా మందిరాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తామని, ప్రతి ఇంటికీ ఒక మొక్క కార్యక్రమం ద్వారా పచ్చదనాన్ని పెంచుతామని తెలిపారు. వీటితో పాటు గ్రామ రహదారులను సిసి రోడ్లుగా మారుస్తామన్నారు.
గ్రామ క్రీడాకారుల కోసం స్పోర్ట్స్ అకాడమీ, ఓపెన్ జిమ్ ఏర్పాటు వంటి అంశాలను కూడా శ్రీనివాస్ తన కార్యచరణలో చేర్చారు. ఈ హామీల అమలుతో మాదాపూర్ గ్రామం సరికొత్త వెలుగులు నింపుకుంటుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: Political Funding Report: పార్టీల పైసా వసూల్ ! రెండు తెలుగు రాష్ట్రలో ఏ పార్టీ కలెక్షన్ ఎంతెంత..?