Telangana Tourism Policy 2025-30: దేశంలో పర్యాటక రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న కేరళతో పోటీపడే స్థాయిలో తెలంగాణ పర్యాటకాన్ని తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శాసనసభ వేదికగా ప్రకటించారు. సోమవారం శాసనసభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ… గత ప్రభుత్వం సరైన విధానం లేక పర్యాటక రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, కానీ తమ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ‘నూతన పర్యాటక విధానం 2025-30’ని తీసుకొచ్చిందని తెలిపారు.
పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) పద్ధతిలో ఈ రంగాన్ని అభివృద్ధి చేస్తామని, దేశ విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు రాయితీలు కల్పిస్తున్నామని, దీనికి గ్లోబల్ సమ్మిట్లో మంచి స్పందన లభించిందని వివరించారు.
రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై మంత్రి స్పష్టమైన హామీలు ఇచ్చారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని నిజాం సాగర్లో వాటర్ స్పోర్ట్స్, బోటింగ్ సదుపాయాలతో పాటు కౌలస్ కోట, నాగన్నమెట్ల బావిని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. శ్రీరాంసాగర్ (SRSP) బ్యాక్ వాటర్ ఏరియాను పర్యాటక స్పాట్గా మార్చి, అక్కడ బోటింగ్, హరిత హోటల్ పునరుద్ధరణ చేపడతామన్నారు.
ఆధ్యాత్మిక పర్యాటకంలో భాగంగా బాసర జ్ఞాన సరస్వతీ ఆలయం, ఆదిలాబాద్లోని జైనథ్ ఆలయం, డిచ్పల్లి ఖిల్లా రామాలయాలను అభివృద్ధి చేస్తామని, వేములవాడ రాజన్న గుడి చెరువు సుందరీకరణతో పాటు రోప్ వే ఏర్పాటుపై సాధ్యసాధ్యాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
హైదరాబాద్లోని చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్ వంటి వారసత్వ సంపదను ప్రపంచానికి చాటిచెప్పేలా చర్యలు తీసుకుంటున్నామని, పర్యాటక అభివృద్ధి ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి, ఉపాధి అవకాశాలను పెంచడమే తమ లక్ష్యమని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.