తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం.. నేడు సాయంత్రం నాలుగు గంటల లోపు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల వల్ల బలమైన ఈదురు గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సూచనలు ఉన్నాయని స్పష్టం చేశారు.
ముఖ్యంగా సంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇస్నాపూర్, పాశమైలారం, రుద్రారం, కంది, సదాశివపేట ప్రాంతాల్లో భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో వడగళ్ల వాన పడే ప్రమాదం కూడా పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అకాల వర్షం ధాటికి రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో వడగళ్లు పడితే తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పటాన్ చెరు, మదీనాగూడ, బాచుపల్లి ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. నగరంలోని ఇతర ప్రాంతాల్లో రాబోయే రెండు గంటల వ్యవధిలో అక్కడక్కడ మాత్రమే చినుకులు పడే అవకాశం ఉంది. ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. వేసవి వేడి నుంచి ఉపశమనం లభించినప్పటికీ ఈదురు గాలులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి.
విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ గాలులు వీస్తున్న నేపథ్యంలో చెట్లు విరిగి పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షం కురుస్తున్న సమయంలో విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ALSO READ: Nara Lokesh: 20 లక్షల ఉద్యోగాల కల్పనే ఏకైక లక్ష్యం.. ఏపీఈడీబీ కార్యాలయ ప్రారంభోత్సవంలో లోకేష్