Secunderabad: సికింద్రాబాద్ పరిధిలోని పార్సిగుట్టలో ప్రజలను విస్మయానికి గురిచేసే ఘటన వెలుగుచూసింది. A1 ఫ్రెష్ చికెన్ అనే పేరుతో తాజాగా ఉంటుందని నమ్మించి.. లోపల మాత్రం కుళ్ళిపోయిన మాంసాన్ని విక్రయిస్తున్న వైనాన్ని అధికారులు బట్టబయలు చేశారు.
నగరంలో కలుషిత ఆహారంపై నిఘా పెంచిన అధికారులు.. అందిన పక్కా సమాచారంతో సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ , జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. పార్సిగుట్టలోని A1 ఫ్రెష్ చికెన్ సెంటర్పై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. షాపులో నిల్వ ఉంచిన మాంసం చూసి అధికారులు సైతం షాక్కి గురయ్యారు. ఏకంగా 800 కిలోల కుళ్ళిపోయిన చికెన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సాధారణంగా చికెన్ ఏ రోజుకారోజు విక్రయించాలి. కానీ, ఇక్కడ చాలా రోజుల క్రితం కోసిన మాంసాన్ని ఫ్రీజర్లలో ఉంచి, దానిని ప్రజలకు అమ్ముతున్నారు. ఈ తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న మాంసం అప్పటికే రంగు మారి, తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో అధికారులు దానిని వెంటనే సీజ్ చేశారు. కేవలం స్థానిక ప్రజలకే కాకుండా, ఈ కుళ్ళిపోయిన చికెన్ను నగరంలోని పలు వైన్స్, బార్లు, రెస్టారెంట్లకు కూడా సప్లై చేస్తున్నట్లు విచారణలో తేలింది.
కేవలం నాణ్యత లోపమే కాకుండా, ఈ దుకాణం చట్టవిరుద్ధంగా కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ షాపుకు సంబంధించిన లైసెన్స్ గత జనవరి నెలలోనే ముగిసిపోయింది. రెన్యూవల్ చేసుకోకుండానే గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం సాగిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన షాపు నిర్వాహకుడు షకిల్తో పాటు మరో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: స్కూల్ బస్సు ఢీకొని వ్యక్తి స్పాట్ డెడ్