Nara Lokesh: రాష్ట్ర యువతకు ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అడుగులు వేయాలని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరి సమీపంలోని చినకాకానిలో గల మయూరి టెక్ పార్క్లో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు (APEDB) నూతన కార్యాలయాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని శిలాఫలకాన్ని ఆవిష్కరించి అధికారులతో కలిసి ప్రాంగణమంతా కలియతిరిగారు. అనంతరం ఏపీఈడీబీ ఉద్యోగులు అధికారులను ఉద్దేశించి ఆయన దిశానిర్దేశం చేశారు.
గత ప్రభుత్వం ఏపీఈడీబీని నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన లోకేష్.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడుల ఆకర్షణలో వేగం పెరిగిందని పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీని నెరవేర్చడమే తమ ప్రభుత్వ సింగిల్ ఎజెండా అని స్పష్టం చేశారు. కేవలం కాగితాల మీద ఒప్పందాలు (MoUs) చేసుకోవడమే కాకుండా.. అవి క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చి పరిశ్రమలు గ్రౌండింగ్ అయ్యేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం పెట్టుబడులలో 25 శాతం వాటా ఏపీ సాధించడం అభినందనీయమని ఏపీఈడీబీ బృందాన్ని ప్రశంసించారు.
రాష్ట్రానికి గూగుల్.. ఆర్సెలార్ మిట్టల్.. టీసీఎస్.. కాగ్నిజెంట్ వంటి ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలు తరలివస్తున్నాయని మంత్రి గుర్తు చేశారు. రిలయన్స్ సీబీజీ ప్రాజెక్ట్ ద్వారా పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని ఆయన తెలిపారు. అధికారులు తమకు కేటాయించిన క్లస్టర్లలో నిపుణులుగా మారాలని.. ఇప్పటికే గుర్తించిన 22 క్లస్టర్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఏ ప్రాజెక్టు కూడా రాష్ట్రం దాటి ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా పకడ్బందీగా వ్యవహరించాలని అధికారులకు తేల్చిచెప్పారు.
రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఈ నెల 23న రెండో స్టీల్ సిటీకి శంకుస్థాపన చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో ఐదు స్టీల్ సిటీల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని.. ఉన్నతంగా ఆలోచించాలని అధికారులను కోరారు. రాజధాని అమరావతి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని.. ఏప్రిల్ చివరి నాటికి ఉండవల్లి నుంచి సీడ్ యాక్సిస్ రోడ్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. దేశం రాష్ట్రం గర్వపడేలా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి ఉద్యోగాల కల్పనలో కీలక పాత్ర పోషించాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.
Read Also: YS Jagan Mohan Reddy: బాబు హామీలన్నీ మోసాలే.. రెండేళ్లలోనే అప్పులు మూడు లక్షల కోట్లు దాటాయి: జగన్